న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి దాదాపు పదేండ్ల తర్వాత ఏపీ భవన్‌ విభజనకు మోక్షం లభించింది. ఏపీ భవన్‌ను రెండుగా విభజిస్తూ కేంద్ర హోం శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్‌ విభజనపై తెలంగాణ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకారం తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అశోక రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉండగా.. తెలంగాణకు 8.24 ఎకరాలు, ఏపీకి 11.53 ఎకరాలను కేటాయించింది.


ఏపీ భవన్‌లోని శబరి బ్లాక్‌లో 3 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో 5.24 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. ఏపీకి 5.78 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్‌, స్వర్ణముఖి బ్లాక్‌లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే గోదావరి బ్లాక్‌లోని నర్సింగ్‌ హాస్టల్‌లో 3.35 ఎకరాలను, పటౌడీ హౌస్‌లో 2.39 ఎకరాలు ఏపీకి కేటాయించింది.ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది.