Deputy Speaker
- గంట పాటు నీటిపై తేలియాడే యోగాసన ప్రక్రియ సాధన
- హాజరైన మంత్రి బొత్స, స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం రాజన్నదొర
విధాత: విజయనగరం ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తన వయసును సైతం లెక్క చేయకుండా సాహసం చేశారు. గంట పాటు నీటిపై తేలియాడుతూ యోగ సాధన చేసి అందరినీ ఆశ్చర్యకితులను చేశారు. క్రీడా రంగ విశిష్టతను, క్రీడల ప్రాధాన్యతను నేటి యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా సాగింది.
జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్ పూల్లో డిప్యూటీ స్పీకర్ నిర్వహించిన జలాసన ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
క్రీడల ఆవశ్యకతను తెలుపుతూ డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భావితర క్రీడాకారుల్లో తప్పకుండా స్ఫూర్తి నింపుతుందని.. చైతన్యం తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. సామాజిక చైతన్యానికి, ప్రజల ఆరోగ్యానికి ఇలాంటి ప్రక్రియలు ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ.. డిప్యూటీ స్పీకర్ చేపట్టిన సాహసాన్ని అభినందించారు.
అట్టహాసంగా కార్యక్రమం..
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మంగళవారం తలపెట్టిన యోగాసన ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. వందలాది మంది ప్రజలు, ఆయన అభిమానులు విచ్చేసి వీక్షించారు. కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. స్థానిక ప్రజలు, అభిమానుల సౌకర్యార్థం ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సు ఆవరణలో, నగరంలో పలు చోట్ల ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
క్రీడల ప్రాధాన్యతను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం: డిప్యూటీ స్పీకర్
జలాసనం వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి క్రీడల ప్రాధాన్యతను నేటి యువతరానికి తెలియజేయాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని అందుకే ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాన్ని చేశానని పేర్కొన్నారు.
సెల్ ఫోన్లు, టీవీల మోజులో పడి యువత క్రీడలకు దూరం అవుతున్నారని వాటి ఆవశ్యకతను తెలుసుకొని క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన వంతుగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు.