అయోధ్య హోటళ్లు ఫుల్.. ఆకాశాన్నంటుతున్న ధరలు
జనవరి 22న అయోధ్య రామమందిరంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో అక్కడి హోటళ్లు అన్ని ఫుల్ అయ్యాయి

- ఒక్కో గదికి లక్ష.. 80 శాతం పెరిగిన రేట్లు
- రామాలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ
- నేపథ్యంలో అన్ని హోటళ్లకు భారీ డిమాండ్
విధాత: జనవరి 22న అయోధ్య రామమందిరంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో అక్కడి హోటళ్లు అన్ని ఫుల్ అయ్యాయి. దాదాపు అన్ని హోటళ్ల గదులు రిజర్వు అయ్యాయి. రెండు వారాల ముందు నుంచే హోటల్ గదుల రేట్లు కూడా 80 శాతం వరకు పెరిగాయి. అయోధ్యకు అతిథుల రద్దీ పెరగడంతో హోటల్ ధరలు, ఆహారం, అద్దెలు గరిష్ఠ స్థాయికి చేరాయి.
అయోధ్యలోని హోటల్ గదుల ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. కొన్ని విలాసవంతమైన గదులు ఒక్క రోజుకే రూ.లక్ష వరకు ఖర్చవుతున్నాయి. ఛార్జీలు గణనీయంగా పెరిగినప్పటికీ, హోటళ్ల బుకింగ్లు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 3 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రజలు ఈ నెల 22న అయోధ్యకు వస్తున్నారని అంచనా వేస్తున్నారు.
బిజినెస్ టుడే ప్రకారం.. జనవరి 22న సిగ్నెట్ కలెక్షన్ హోటల్ ఒక గదికి రూ.70,240 వసూలు చేస్తున్నది. గత ఏడాది ఇదే జనవరిలో రూ.16,800 రేటుతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు పెరిగింది. ది రామాయణ్ హోటల్ 2023 జనవరిలో రూ.14,900తో పోలిస్తే రోజుకు రూ.40,000తో గదిని అందిస్తున్నది. అయోధ్య ప్యాలెస్లో ఒక్క గది అద్దె గతంలో రూ.3,722 ధర ఉంటే నేడు రూ.18,221 కు పెరిగింది.
ఇటీవలే ప్రారంభించబడిన పార్క్ ఇన్ రాడిసన్లోని హోటల్లో ఒక సూట్రూమ్ రూ.1 లక్షకు రిజర్వ్ చేసుకున్నారు. హోటల్ పూర్తిగా బుక్ అయిపోయింది. భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని రాడిసన్ ద్వారా హోటల్ పార్క్ ఇన్కి చెందిన వైభవ్ కులకర్ణి పేర్కొన్నారు. హోటల్ గదుల రేట్లు రూ. 7,500 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.జనవరి 20 నుంచి 23 వరకు రామాయణ హోటల్ మొత్తం ఇప్పటికే రిజర్వు చేయబడింది. ఫిబ్రవరి, మార్చిలో 80 శాతం గదులు రిజర్వు అయ్యాయి. రూ. 10,000 నుంచి రూ. 25,000 వరకు గదుల ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు.