Site icon vidhaatha

Bandi Sanjay | ఇష్టానుసారంగా.. స్మార్ట్ సిటీ పనులు: అధికారులపై బండి సంజయ్ అసంతృప్తి

Bandi Sanjay |

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. సోమవారం స్థానిక టవర్ సర్కిల్ వద్ద స్మార్ట్ సిటీ పనులను ఆయన పర్యవేక్షించారు.

నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులపై ప్రజలు సంతృప్తికరంగా లేరని ఆయన చెప్పారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను ఇష్టానుసారంగా చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.

కొంతమంది అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి పనుల అమలులో బీజేపీ కార్పొరేటర్లపై వివక్ష చూపిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. బిజెపి కార్పొరేటర్ లను కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించారనే విషయాన్ని మర్చిపోతున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అభివృద్ధి పనుల్లో వివక్ష చూపితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అనేకమంది స్థానిక సమస్యలను ఏకరవు పెట్టారు. పనుల నాణ్యత పైనా ఫిర్యాదులు చేశారు. దీంతో అధికారులు, స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ పని తీరుపై బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

Exit mobile version