Bhatti Padaytra ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ లో కదనోత్సాహం నింపిన భట్టి పాదయాత్ర ..! విధాత : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనసాగిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి నల్గొండ జిల్లాను దాటి గురువారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర 105వ రోజు కోదాడ నియోజకవర్గం మోతే, హుస్సేనాబాద్, మామిళ్ళగూడెంల మీదుగా జిల్లాను దాటి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోకి ప్రవేశించింది. నాయకోని గూడెం మీదుగా రాత్రి పాలేరుకు చేరుకొనుంది. నల్గొండ జిల్లాలో తొలుత […]
Bhatti Padaytra
విధాత : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనసాగిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి నల్గొండ జిల్లాను దాటి గురువారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర 105వ రోజు కోదాడ నియోజకవర్గం మోతే, హుస్సేనాబాద్, మామిళ్ళగూడెంల మీదుగా జిల్లాను దాటి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోకి ప్రవేశించింది. నాయకోని గూడెం మీదుగా రాత్రి పాలేరుకు చేరుకొనుంది.
నల్గొండ జిల్లాలో తొలుత భట్టి పాదయాత్ర గత ఏప్రిల్ 30వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోకి జనగామ మీదుగా ప్రవేశించి ఆలేరు, భువనగిరి నియోజకవర్గంలలో మే 5వ తేది వరకు 86 కిలోమీటర్లు కొనసాగింది.
రెండో దశలో జూన్ 8న అచ్చంపేట నియోజకవర్గం నుంచి నల్గొండ జిల్లాలోకి దేవరకొండ నియోజకవర్గంలో ప్రవేశించిన భట్టి పాదయాత్ర శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు, నక్కలగండి, డిండి ప్రాజెక్టుల సందర్శనతో కొనసాగి దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల మీదుగా 20రోజుల పాటు 221 కిలోమీటర్లు కొనసాగింది.
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని బట్టి పాదయాత్ర 100 రోజులు.. 1000 కిలోమీటర్లు మైలురాయిని అధిగమించింది. ఈనెల 11వ తేదీన దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లి వద్ద వేయి కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరించారు. 15వ తేదీన భట్టి పాదయాత్రలోనే తన పుట్టినరోజు జరుపుకున్నారు. భట్టి పాదయాత్ర 20 వ రోజున గురువారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోకి ప్రవేశించింది.
లుకలుకలు రచ్చకెక్కినా.. గెలుపు పై ధీమా పెంచిన పాదయాత్ర
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు దశల్లో సాగిన భట్టి పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూపు తగాదాలు పాదయాత్ర సభల్లో భట్టి సాక్షిగా వీదికేక్కినప్పటికీ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు దిశగా భరోసాను మాత్రం పార్టీ క్యాడర్లో కలిగించిందని చెప్పవచ్చు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగిన గ్రామాల్లో దారి వెంట గ్రామాల ప్రజలు రైతులు మహిళలు పెద్ద సంఖ్యలో భట్టిని కలిసి తమ సంఘీభావం తెలిపి సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. భట్టి సైతం రానున్నది ఇందిరమ్మ రాజ్యం అంటూ వారి సమస్యలన్నీ కాంగ్రెస్ పరిష్కరిస్తుందంటు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా భట్టి పాదయాత్ర అసలు లక్ష్యమైన కాంగ్రెస్ బలోపేతం, బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలలో జిల్లాలో విజయవంతమైందని భావిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని, సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపైన, జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో వారి వైఫల్యాల పైన భట్టి సంధించిన విమర్శలు ప్రజల్లోకి సూటిగా వెళ్లడంతో అధికార పార్టీ నేతలంతా ఎదురుదాడికి దిగారు. జిల్లా ఫ్లోరైడ్ సమస్య, పెండింగ్ ప్రాజెక్టులు, వెనుకబాటు అంతా కాంగ్రెస్ పాపమే అంటూ భట్టి విమర్శలను తిప్పి కొట్టారు.
దీంతో జిల్లా రాజకీయాల్లో భట్టి వర్సెస్ బిఆర్ఎస్ నేతల మధ్య సాగిన మాటల యుద్ధం రాజకీయ మంటలను రగిలించింది. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు,నక్కలగండి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణ జాప్యంపై భట్టి తన పాదయాత్రలో ప్రధానంగా అధికార పార్టీని నిలదీశారు. సూర్యాపేట జిల్లాకు వస్తున్నవి కాళేశ్వరం నీళ్లు కాదని దీనిపై చర్చకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి కి సవాల్ విసిరిన భట్టి జనంలో ఈ సమస్యను చర్చకు నిలిపారు.
అదిలాబాదు నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు కొనసాగిన పాదయాత్రలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాల సాధన సిద్ధించలేదని ప్రజలు భావిస్తున్నట్లుగా భట్టి పాదయాత్ర సభల్లో గట్టిగా వినిపించారు. కెసిఆర్ కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా పోయాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని భట్టి జనానికి ఏకరువు పెట్టారు. పాదయాత్రలో జిల్లా సీనియర్లు కే. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలు ఏదో ఒక దశలో హాజరై కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ఉన్నామన్న సందేశాన్ని జనం ముందు ఉంచగలిగారు.
అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే సహా రాష్ట్ర పార్టీ నాయకులు పలు సందర్భాల్లో భట్టి పాదయాత్రలో సందడి చేసి పార్టీ కేడర్ లో జోష్ నింపారు. ఇక ప్రజాపార్టీ అధ్యక్షుడు గద్దర్ సైతం భట్టి పాదయాత్రకు సంఘీభావం తెలిపి తనదైన శైలిలో ఆటాపాటలతో జన చైతన్యాన్ని రగిలించారు. వడదెబ్బతో పాదయాత్రకు బ్రేక్ పడిన సందర్భంలో థాక్రేతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు భట్టి వద్దకు వచ్చి పార్టీలో చేరికలపైన చర్చించడం ఆసక్తికర ఘట్టంగా మిగిలింది.
దారి పొడుగునా సాగిన వర్గ పోరు
భట్టి పాదయాత్రలో తొలిదశ ఆలేరు భువననగిరిలలో బీర్ల ఐలయ్య, కల్లూరి రామచంద్రారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య వర్గ పోరు బహిర్గతమైంది.
రెండో దశలో దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే ఎన్. బాలునాయక్ కు, కిషన్ నాయక్, లాలు, బిల్యా నాయక్ వర్గాల మధ్య వర్గ పోరు పాదయాత్ర సభా వేదికలపైనే రచ్చకెక్కింది. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు తమ వ్యతిరేక వర్గం చెరుకు సుధాకర్ గౌడ్ సహా ఇతరులను వేదిక పైకి కూడా ఎక్కనివ్వలేదు. నకిరేకల్ లో కొండేటి మల్లయ్య, దైద రవీందర్, వేదాస్ వెంకయ్యలు పాదయాత్రను బల ప్రదర్శనగా మార్చేసుకున్నారు.
సూర్యాపేటలో మాజీమంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు బాహాబాహికి దిగారు. అనంతరం భట్టితో కలిసి ఇరువురు పాదయాత్రలో కనిపించారు. తన సమక్షంలోనే ఆయా నియోజకవర్గాలలో పార్టీ వర్గ పోరును చూసిన భట్టి సహనంతో సర్దుకుపోతూ.. ఇదే రీతిలో పార్టీ గెలిచే దాకా మీరంతా సర్దుకుపోవాలంటూ నాయకులకు, కేడర్ కు హితవు పలికారు. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధ్యంతం మండుటెండలు, అకాల వర్షాల మధ్య సాగిన భట్టి రెండు దశల పాదయాత్ర ఆశించిన లక్ష్యాలను చేరుకొని.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపు పై నమ్మకాన్ని, పార్టీ గ్రాఫ్ ను పెంచిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.