విధాత: నల్గొండ (Nalgonda) జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురయింది.
ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు ముందెన్నడు లేని రీతిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామంలో ఒక కోటి 50 లక్షలతో అభివృద్ధి పనులు, సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు.
దీంతో కొందరు గ్రామస్తులు ఎమ్మెల్యే మాటలన్నీ అబద్దాలని, ఆయన చెప్పిన నిధులతో అభివృద్ధి ఎక్కడ జరిగిందో, సీసీ రోడ్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలంటూ నిలదీశారు. మా గ్రామానికి ఎమ్మెల్యేగా ఏం చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్తులను వారించారు. అనంతరం ఎమ్మెల్యే కంచర్ల అక్కడి నుంచి వెళ్లిపోయారు.