కేసీఆర్ ఇంట్లో మరికొందరు జైలుకెలుతారు

బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత బాటలోనే కేసీఆర్ ఇంట్లో మరికొందరు త్వరలోనే జైలుకెళ్లక తప్పదని బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు

  • Publish Date - April 19, 2024 / 03:19 PM IST

హరీశ్‌రావు గట్టు మీద నిల్చున్నారు
బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్‌రావు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత బాటలోనే కేసీఆర్ ఇంట్లో మరికొందరు త్వరలోనే జైలుకెళ్లక తప్పదని బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నంగునూర్ మండలం కోనాయి పల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. హరీష్ రావు గట్టు మీద నిల్చున్నారని.. కాంగ్రెస్‌లోకి పోతారా?.. అందులోనే ఉంటారా? మునుముందు తేలనుందన్నారు.

రేవంత్ రెడ్డి గెలిచి నాలుగు నెలలు అయినా రూ.4 వేల పించన్ ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా?.. లేదా ఖాళీ బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే గెలిస్తే ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 న రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నేటికీ రుణమాఫి చేయలేదని విమర్శించారు. ఈ దేశం బాగుండాలి అంటే బీజేపీ గెలవాలన్నారు.

ఇంకా ఐదేండ్లు ఉచిత రేషన్ బియ్యం అందిస్తామన్నారు. మోదీ రైతులకు సబ్సిడీతో ఎరువుల బస్తాలు అందించారన్నారు. 39 ఏండ్లుగా సిద్దిపేటలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. కేసీఆర్ అంటే కాళేశ్వర రావు అంటారని, కానీ నంగునూర్‌లోని ఒక్క చెరువులో నీళ్ళు లేవని విమర్శించారు. ఈ ఎన్నికలు కవితను తీహార్ జైలు నుంచి బయటకు తెచ్చే ఎన్నికలు కావన్నారు.

రఘునందన్‌రావు దుబ్బాకలో ఓడిపోవడం ఎంత నిజమో కామారెడ్డిలో కేసీఆర్‌ను బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజమన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరన్నారు. రూ.1600 కోట్ల కేంద్ర నిధులతోనే సిద్దిపేట నుంచి ఎలకతుర్తి వరకు కేంద్ర నిధులతో రోడ్ పనులు నడుస్తున్నాయన్నారు. దేశంలోని ఇస్లామిక్ తీవ్రవాదం పోవాలి అంటే.. హిందూ మత రక్షణ జరగాలి అంటే నరేంద్ర మోడీ గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో చేస్తున్న రాజకీయాలను తిప్పి కొట్టాలని రఘునందన్‌ రావు పిలుపునిచ్చారు.

Latest News