Site icon vidhaatha

ఇకపై రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు



విధాత బ్యూరో, కరీంనగర్: సాధారణ భక్తులకు దర్శన ఇబ్బందులు దూరం చేసేందుకు… తిరుమల తరహాలో వీఐపీ బ్రేక్ దర్శనంకు ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. విఐపి బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం గంట చొప్పున వీఐపీలకు బ్రేక్ దర్శనానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఇందుకు సాధ్యాసాధ్యాలపై క్షేత్ర అధ్యయనం చేయాలన్నారు. వీలైతే శివరాత్రి జాతరలోగానే బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేయాలన్నారు.


ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలన్నారు. మంగళవారం మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఓపెన్ స్లాబ్ లో కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందన్నారు.


మహాశివరాత్రి జాతరను రాష్ట్ర పండుగగా భావించి భక్తులు సులభంగా, వేగంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. శివ స్వాములు, పుర ప్రముఖులు, పాత్రికేయులకు సులభ దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శన సమయం కూడా అరగంట అదనంగా పెంచాలన్నారు. పుర ప్రముఖులకు గతంలో మాదిరి బ్యాడ్జీలు అందజేసి సులభ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.


ప్రస్తుతం భక్తుల కోసం రెండు క్యూ లైన్ ల పద్ధతి ఉన్న దృష్ట్యా విఐపి ల కోసం మూడో క్యూ లైన్ శివరాత్రి లోగా ఏర్పాటు చేయాలని చెప్పారు. బద్ది పోచమ్మ వద్ద కూడా భక్తులకు త్రాగునీరు, కూర్చునేందుకు కుర్చీలను , పందిళ్ళ సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా వేములవాడకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక బస్సులను నడిపించాలన్నారు.


పారిశుద్ధ్య పనుల నిర్వహణకు చర్యలు


జిల్లా కలెక్టర్ సూచించినట్లు గతంలోని జోన్లను పిన్ పాయింట్ లొకేషన్ లుగా విభజించి ప్రతీ పాయింట్ లో ఒక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలన్నారు. నిఘా నేత్రాలతో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు శాశ్వత సీసీ కెమెరాలను పెట్టాలన్నారు. భక్తులకు సరిపడా సురక్షిత త్రాగు నీరు సరఫరా చేయాలన్నారు. భక్తులకు క్యూ లైన్ లో మంచి నీరు సరఫరా చేయాలన్నారు. చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా వారితో చర్చించాలన్నారు. జాతర విజయవంతానికి ప్రభుత్వ శాఖల అధికారులు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించాలన్నారు


కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సౌకర్యాలు కల్పించాలని ఛైర్మన్, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. భక్తులు స్వామి వారి దర్శనాన్ని వేగంగా, సౌకర్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని వివరించారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దాకా, వేములవాడను కనెక్ట్ చేసే అన్ని అప్రోచ్ రోడ్లను, పట్టణ అంతర్గత రోడ్ల మరమ్మత్తు పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.


భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ లు సిద్ధం చేయాలని ఆర్ టీ సీ అధికారులకు సూచించారు. తిప్పాపూర్ ఆర్ టీ సీ బస్ స్టాండ్ లో తాగు నీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, దానికి ఒక అధికారిని నియమించాలని వేములవాడ డీఎంను ఆదేశించారు. ఆలయ వసతి గదుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడే పరిష్కరించాలని ఈఓ కృష్ణ ప్రసాద్ కు సూచించారు. వేములవాడ మున్సిపల్, ఆలయ అధికారులు సంయుక్తంగా పారిశుధ్య పనులు చేయించాలని, ఎక్కడా ఇబ్బంది రాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.


‘మే ఐ హెల్ప్ యూ’ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దానిలో పనిచేసే సిబ్బంది వద్ద ఆలయానికి సంబందించిన పూర్తి సమాచారం, అందరి ఫోన్ నంబర్ లు ఉండాలని తెలిపారు. ఈ కేంద్రాల్లోని వారికి ఆలయానికి సంబందించిన పూర్తి సమాచారం ఉండాలని, వారికి శిక్షణ కూడా ఇవ్వాలని ఆదేశించారు. జాతర విధుల్లో పాల్గొనే అన్ని శాఖల అధికారులు వారి సమగ్ర యాక్షన్ ప్లాన్ తో రావాలని, ఏ ఏ అధికారి, సిబ్బంది ఇక్కడికి వస్తారు, వారి ఫోన్ నంబర్, వారికి కేటాయించే బాధ్యతల వివరాలు తమకు సమర్పించాలని తెలిపారు.


జాతర సందర్బంగా ఆ అధికారి అందుబాటులో లేరనే సమాధానం రాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. శాశ్వత పద్దతిలో ఆధునిక టాయిలెట్ లు నిర్మించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఆలయం, ఆవరణలోని నీటి టాంక్ లను ప్రతి ఐదు రోజులకు ఒక్కసారి శుభ్రం చేయించాలని పేర్కొన్నారు. ఆలయం లోని క్యూల వద్ద, జాతర గ్రౌండ్, పార్కింగ్ స్థలాల వద్ద తాగు నీటి, టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. భక్తులకు నిత్య అన్నదానం కల్పించే విషయం పరిశీలించాలని, దేవాదాయ శాఖ ఉన్నత అధికారులను సంప్రదించాలని సూచించారు. జాతర ప్రదేశాల్లో నాణ్యమైన తాగునీటిని అందుబాటులో పెట్టాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.


బద్ది పోచమ్మ ఆలయానికి బోనాలతో వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరో సమావేశం నిర్వహిస్తామని, అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు స్వామి వారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, భక్తులకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్బంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.


వేములవాడ లో కావాల్సిన సైన్ బోర్డ్, టోయింగ్ వాహనం, క్రేన్ అందుబాటులో ఉంచాలని ఆలయ ఈవోకు సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాలంటీర్ లను తమకు అప్పగించాలని వివరించారు. హోటల్, లాడ్జ్ ల నిర్వహకులను వచ్చే సమావేశానికి రావాలని సూచించారు. ఆలయం అధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని మాపక అధికారులు ఆలయ సిబ్బందికి అగ్ని మాపక పరికరాలు వాడే విధానంపై ముందస్తు అవగాహన కల్పించాలని తెలిపారు.


అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పి అఖిల్ మహాజన్, ఆలయ అధికారులతో కలిసి భక్తులకు సులభంగా, వేగంగా సులభ దర్శనం అయ్యేలా చూసేందుకు మూడో క్యూ లైన్ ఏర్పాటుపై ఆలయ పరిసరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ట్రైనీ ఐపీఎస్‌ రాహుల్ రెడ్డి, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, వేములవాడ ఆర్డీఓ మధు సూదన్ , డీఎస్పీ నాగేంద్ర చారి, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version