MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. నిన్న సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జీషీట్లో కవిత పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు.
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. నిన్న సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జీషీట్లో కవిత పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవితను ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించిన వారి జాబితాలో కూడా కవిత పేరు లేదు.
ఏప్రిలో 25న అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసిన సీబీఐ.. సుమారు 5700 పేజీలతో రెండో ఛార్జిషీటును శనివారం దాఖలు చేసింది. మొదటి ఛార్జిషీటు గతేడాది నవంబర్ 25న దాఖలు చేసింది. మొదటి ఛార్జీషీటు దాఖలు చేసిన తర్వాత తొలిసారిగా డిసెంబర్ 11న కవితను హైదరాబాద్లో సీబీఐ ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను ఛార్జీషీటులో ప్రస్తావించిన సీబీఐ.. కవిత పేరును మాత్రం ప్రస్తావించలేదు.
కవిత విషయంలో దర్యాప్తు సంస్థల వైఖరికి ఆమె విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవా..? మరేదైనా కారణమా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అటు ఈడీ, ఇటు సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్లలోనూ ప్రధానంగా మనీష్ సిసోడియాపైనే అభియోగాలు ఉన్నాయి. అయితే ఈడీ ఛార్జీషీటును పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు ఈ నెల 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లోనూ కవితపై రోటిన్ అభియోగాలనే మోపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కవిత నిందితులను కలిశారు, సమావేశమయ్యారు, మాట్లాడారు లాంటి గత అభియోగాలనే మరోమారు తాజా అభియోగపత్రంలో ఈడీ పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముడుపుల వ్యవహారానికి సంబంధించి కూడా ఈడీ ఛార్జిషీటులో కవిత పేరు ఎక్కడా లేనట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలోనూ కవిత పేరు లేదని సమాచారం. అయితే గతంలో కవితను ఈడీ మూడుసార్లు ప్రశ్నించింది.