CM Revanth Reddy: టన్నెల్ ప్రమాద కుటుంబాలను ఆదుకుంటాం.. ప్రాజెక్టు పూర్తి చేస్తాం

విధాత: ఇటీవల పనులు జరుగుతుండగా కూలిన SLBC టన్నెల్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రులు ఉత్తమ్, జూపల్లిలతో కలిసి సందర్శించారు. టన్నెల్లో చికక్ఉకుపోయిన వారి రక్షణకు సంబంధఙంచి జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం సహాయక బృందాలతో మాట్లాడారు. అధికారులను అడిగి రెస్క్యూ వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం SLBC టన్నెల్ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని, టన్నెల్ పనులు చేసే సంస్థకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని పైగా ఆ సంస్థ విద్యుత్ బకాయిలు చెల్లించలేదని విద్యుత్ నిలిపివేశారని, అంతేగాక విద్యుత్ లేకపోవడంతో టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రతీష్ఠాత్మక ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టిందని, సంస్థకు బిల్లులు చెల్లించి, సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యలు పరిష్కరించాం అన్నారు.
మిషనరీకి సంబంధించి స్పేర్ పార్ట్స్ అమెరికా నుంచి తెప్పించామని, పనులను వేగంగా పూర్తి చేసి నల్లగొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని మేం చిత్తశుద్దితో పనిచేస్తుంటే.. అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందని, ఇది అనుకొని ప్రమాదం
ఇలాంటి విపత్తులు జరిగినపుడు రాజకీయాలకు అతీతంగా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలి, ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా బాధిత కుటుంబాలపై సానుభూతి చూపించి వారిని ఆదుకోవాలని అన్నారు.ఆర్మీ, టన్నెల్ ఎక్స్పర్స్ట్స్ తో సహా 11 డిపార్ట్ మెంట్స్ సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయని, వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నామని, టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదని, ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారన్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారిందని, రేపటిలోగా కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుందని స్పష్టం చేశారు.
ఆ ఎనిమిది మంది లోపల ఎక్కడ చిక్కుకుపోయారో, ఎక్కడ మిషనరీ పాడైపోయిందో అధికారులు ఇంకా పూర్తిస్థాయి అంచనాకు రాలేదని, ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశాం అన్నారు. ఇది ఒక విపత్తు మనందరం ఏకతాటిపై నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ జనరేషన్ లో ప్రమాదం జరిగితే ఎవ్వరినీ అక్కడికి వెళ్లనివ్వలేదని, ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తే నన్ను జైల్లో పెట్టారన్నారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఎక్కడ మరణించినా ఆనాడు ప్రభుత్వం విపక్షాలను అనుమతివ్వలేదని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడకు వెళ్ళలేదని, కానీ ఇవాళ మేం ఘటన జరిగిన వెంటనే ఉత్తమ్ గారిని పంపి, కేంద్రంతో సమన్వయం చేసుకుని అన్ని సంస్థలను ఇక్కడికి రప్పించామని తెలిపారు.
ప్రపంచంలోనే ఇది అతిపెద్ద టన్నెల్ అని.. మేం మనోధైర్యం కోల్పోలేదని, ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, 8 మంది ఆచూకీ కోసం కష్టపడుతున్న రెస్క్యూ సిబ్బందికి చిన్న గాయం కూడా కాకూడదని, అందుకే రోబో లను వినియోగించాలని సూచించాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉందని, ఇందుకు మీరంతా సహకరించాలని కోరుతున్నానని తెలిపారు.