- మూడు అంచెల విధానంలో ముందుకు
- మల్లు రవి నేతృత్వంలో ఉద్యమకార్యాచరణ కమిటీ ఏర్పాటు
- ఈ వ్యవహారంలో ఇతర విపక్షాలను కలుపుని వెళ్లాలా లే ఒంటరిగానే పోరాడాలా? నేటి పీసీసీ భేటీలో తేల్చనున్నది
విధాత: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కాంగ్రెస్ దూకుడు పెంచింది. మూడు అంచెల విధానంలో ముందుకు వెళ్తున్నది. పార్టీ పరంగా పోరాటం చేస్తూనే.. దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం, న్యాయపోరాటం చేయడం ద్వారా త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నది. ఇతర విపక్షాలను కలుపుకుని వెళ్లాలా? లేక ఒంటరిగానే పోరాడాలా? అన్నది ఈరోజు పీసీసీ భేటీలో తేల్చనున్నది.
పేపర్ లీకేజీపై పోరాటాన్ని ఉధృతం చేసేలా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. ఈ వ్యవహారంలో ముందునుంచి సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి నిరుద్యోగుల పక్షాన తన వాదనను గట్టిగా వినిపిస్తున్నారు.
సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తలుపు తట్టింది. సిట్ నమోదు చేసిన కేసులో ఈడీ విచారించదగిన సెక్షన్లు ఉన్నందున తక్షణమే ఆ కేసును తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరినట్టు రేవంత్ వెల్లడించారు.
ఈ కేసులో పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సీనియర్ నేత మల్లు రవి నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. గాంధీభవన్లో సమావేశమైన కమిటీ బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి డీజీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేసింది. డబ్బులు చేతులు మారిన ఈ కేసులో జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు మల్లు రవి వెల్లడించారు.
పేపర్ లీకేజీతో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల భవిష్యత్ అంధకారం చేసారు. కోట్ల రూపాయల అక్రమాలకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి @BRSparty అవినీతికి అడ్డాగా మారింది.
– చింతపల్లి జగదీశ్వర్ రావు గారు. pic.twitter.com/RmVNR4pgs9— Telangana Congress (@INCTelangana) April 1, 2023