మాది ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసి పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు
విధాత : మాది ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసి పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కుసుమంచిలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణ స్కీమ్, 10లక్షల ఆరోగ్య శ్రీ స్కీమ్లను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. వారికి నాయకన్గూడెంలో భారీ గజమాలతో పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి.
అనంతరం వారితో కలిసి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో భట్టి మాట్లాడారు. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వం ప్రధానమైన ఏజెండా అని, ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, వంద రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రతి సంస్థ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.
అసెంబ్లీలో పండుగ వాతావరణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ అందించే గ్యారెంటీని ప్రారంభించామన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేసిన బీఆరెస్ నాయకులకు చెంపపెట్టు లాగా బాధ్యత తీసుకున్న రెండు రోజుల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు హామీలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్ల సమస్య, పోడు భూములు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంటి స్థలాలు ఇచ్చామని, బీఆరెస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కారానికి కోర్టు అనుమతులు ఇచ్చినప్పటికీ బీఆరెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టిందన్నారు. పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ అందించేలా చూస్తామన్నారు. ఖమ్మంలో10 అసెంబ్లీ స్థానాలకు గాను తొమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.
కబ్జాలు లేని ఖమ్మంను అందిస్తాం: తుమ్మల
మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులం ఉన్నామని, తమ శాఖల పరిధిలో వచ్చే నిధులతో జిల్లాలోని పెండింగ్ సమస్యలన్నింటిని పరిష్కరించే కృషి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగానే ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. ముస్లిం, వక్ఫ్ ఆస్తులను, రైతాంగం భూమి వాళ్లకి ఇచ్చేలా రెవెన్యూ మంత్రి పనిచేస్తారన్నారు.
సీతారామ ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు తెస్తామని, పది లక్షల ఎకరాలు సాగవుతాయని, నా జీవిత లక్ష్యం, నా కోరిక గోదావరి జలాలు ఖమ్మం జిల్లా రైతాంగానికి అందించటమేనన్నారు. ఎన్నికల సమయంలో స్వేచ్ఛ, కబ్జాలు లేని ఖమ్మంను ఇస్తానని హామీ ఇచ్చామని, కబ్జాలు లేని ఖమ్మం కావాలని మీరు కోరారని, మీ కోరికను నెరవేరుస్తామని, ప్రశాంతమైన ఖమ్మం, కబ్జాలు లేని ఖమ్మం, నిర్బంధాలు లేని ఖమ్మం మీకు అందిస్తామని తుమ్మల స్పష్టం చేశారు.
హరీశ్ రావు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి :పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రోజులు కాకముందే మాజీ మంత్రి టి.హరీశ్రావు విమర్శలు చేయడంపైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు హరీశ్రావు విలువలు లేకుండా మామకు దోచిపెట్టి తను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కాకముందే విమర్శలు చేస్తున్న హరీశ్రావు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మీరా మా ప్రభుత్వంపై విమర్శలు చేసేదంటూ పొంగులేటి ఫైర్ అయ్యారు.గురివింద గింజకు ఉన్న నలుపు కంటే ఎక్కువ నలుపు మీ కింద పెట్టుకుని కాంగ్రెస్ గురించి మాట్లాడతారా అంటు విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సొమ్మును అక్రమంగా కొల్లగొట్టిన పందికొక్కుల దగ్గర నుంచి అంతా కక్కిస్తామన్నారు. రైతుబంధు పైసల్ వేయడానికి మూడు నెలల సమయం తీసుకున్నాని, అప్పుడే ఏమైందని ముందున్నది ముసళ్ల పండుగన్నారు. బీఆరెస్ అప్పుల కుప్పగా చేసిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిపుష్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు.
ఖమ్మం ప్రజలు తొమ్మిది స్థానాలిచ్చి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చినందుకు వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు. మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను అమలు చేశామని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు.