Komatireddy Rajagopal Reddy l ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ షాక్
మద్యం దుకాణాల నిర్వహణకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడులో సొంత నిబంధనలు పెట్టగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, రాష్ట్రంలో ఒకే ఎక్సైజ్ పాలసీ ఉంటుందని స్పష్టం చేశారు.
విధాత : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మద్యం దుకాణాల నిర్వహణలో తన నియోజకవర్గంలో తను చెప్పిన నిబంధనలు పాటించిన వారే టెండర్లకు ముందుకెళ్లాలని ఇటీవల రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. సాయంత్రం 4నుంచి రాత్రి 9వరకే మద్యం దుకాణాలు తెరవాలని..పర్మిట్ రూమ్లు పెట్టొద్దని రాజగోపాల్ రెడ్డి ఆంక్షలు పెట్టారు. దీంతో నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాల కోసం చాలమంది టెండర్లు వేయడానికి భయపడ్డారు. ఈ సమస్యపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్లి వివరించారు. ప్రభుత్వం నిబంధనలకు భిన్నంగా స్థానిక ఎమ్మెల్యే వైన్స్ ల నిర్వహణకు కొత్త రూల్స్ పెట్టారని..ఇలాగైతే తాము టెండర్లు వేసేదెట్లా అంటూ తమ సమస్యను విన్నవించారు.
దీనిపై స్పందించిన మంత్రి జూపల్లి రాష్ట్రం మొత్తం ఎక్సైజ్ పాలసీ ఒకటే ఉంటుందని, ఎవరిష్టం వచ్చినట్లు వారు సొంత పాలసీలు పెడితే నడవవు కదా అని..అనవసరంగా భయపడకుండా అంతా టెండర్లు వేసుకోవచ్చని స్పష్టం చేశారు. డ్రాలో షాపులు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారని సమాచారం. మరోవైపు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చేసిన వ్యాఖ్యలు…మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల తరుచూ చేస్తున్న కామెంట్లపై ఢిల్లీ హైకమాండ్ కు ఓ నివేదిక అందించారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతుంది.
నేనేమి కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు వ్యతిరేకంగా మాట్లాడలేదు : రాజగోపాల్
మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల నిర్వహణపై తాను చేసిన వ్యాఖ్యలు కొత్త వైన్స్ టెండర్ దరఖాస్తులకు ప్రతికూలంగా మారాయన్న విమర్శలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తానేమి కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు విరుద్దంగా మాట్లాడలేదన్నారు. ప్రభుత్వం వ్యాపారులను ధనవంతులుగా చేసేందుకు పని చేస్తోందా లేక పేద ప్రజల బతుకులు వారి ఆరోగ్యం బాగుండాలని పని చేస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మద్యం ఆదాయం రూ.4500 కోట్లు ఉండే దాన్ని ఇప్పుడు 45 వేల కోట్లకు తీసుకుపోయారని… ఇది మంచి ఆదాయమనేనా అని ప్రశ్నించారు. ప్రజల మంచి కోరుకోవాలే తప్ప పథకాల పేరుతో ఓ చేతికి పైసలు ఇస్తూ మరో చేతి నుంచి మద్యం పేరుతో లాక్కోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి. కానీ ఇలా మద్యం తాగించి పేదల కుటుంబాలను నాశనం చేయవద్దన్నారు. తాను మద్యపానం నిషేధించాలని అనడం లేదని మద్యాన్ని నియంత్రించాలని మాత్రమే చెబుతున్నానన్నారు.
మునుగోడులో వైన్స్ ల నిర్వహణ నాలుగు గంటలే ఉండాలని నేనేమి బహిరంగంగా చెప్పలేదని, నియోజకవర్గం నాయకులకు సూచన చేశానన్నారు. మునుగోడులో ఓపెన్ బెల్డ్ షాపులు లేకుండా నేను కృషి చేశానని గుర్తు చేశారు. వైన్స్ షాపుల కోసం టెండర్లు వేసిన వారికి నేనేమి బెదిరించడం లేదన్నారు. వైన్ షాప్ ఓనర్ కుటుంబం కోసం వెయ్యి కుటుంబాలు నాశనం అవుతాయని మాత్రమే చెబుతున్నానన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే మద్యపాన నియంత్రణకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి తాను సిద్ధమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పక్షంలో ఉన్నాసరే ప్రజల తరఫున మాట్లాడుతానని..తనకు వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డితోనో మరో వ్యక్తితోనే విభేదాలు లేవని అన్నారు. మంత్రి పదవి రాలేదన్న కోపంతో మాట్లాతున్నానని అనుకోవడం సరికాదని.. ప్రజలకు మంచి జరుగుతుంటే మంత్రి పదవే కాదు.. ఎమ్యెల్యే పదవిని సైతం త్యాగం చేస్తానన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram