షెడ్యూల్ భయంతో పంపిణీ వేగవంతం
విధాత : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకగా అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభంకానుంది. బతుకమ్మ చీరల కోసం చేనేత సంఘాలకు 354కోట్లను వెచ్చించి 1.02కోట్ల చీరలను తయారు చేయించారు. దాదాపుగా 25 రంగుల్లో, 600డిజైన్లలో చీరలను తయారు చేయించారు. సిరిసిల్ల, గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల నేత సంఘాలకు చీరల తయారీ బాధ్యతను అప్పగించారు. 16వేల మర మగ్గాలపై చీరలను తయారు చేయించారు.
ఇప్పటికే 98లక్షల చీరలు పంపిణీ పాయింట్ల వద్దకు చేరుకున్నాయి. రాష్ట్రంలో 6వ తేదీ తర్వాతా ఏ క్షణాన్నైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముండటంతో వెంటనే చీరల పంపిణీ చేపట్టడం ద్వారా ఎన్నికల ముందు రాజకీయంగా కూడా లబ్ధి పొందాలని ప్రభుత్వం భావిస్తుంది. నేత కార్మికులకు ఉపాధి కల్పన, ఆడబిడ్డలకు పండుగ కానుక లక్ష్యాలతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని బీఆరెస్ ప్రభుత్వం 2017నుంచి కొనసాగిస్తుంది. 18ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ చేనేత జౌళీ శాఖ, టెస్కోలు ఏటా కోటి మంది చీరల పంపిణీ చేపట్టే బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి.
గతంలో బతుకమ్మ చీరలు నాణ్యత లేవని, డిజైన్లు బాగాలేవని, పొడవు సరిగా లేవన్న విమర్శల నేపధ్యంలో ఈ దఫా డిజైన్ల సంఖ్యను పెంచి, రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన సిల్క్ నూలును వినియోగించి బంగారు, వెండి జరీ అంచులతో పట్టుచీరలను తలపించేలా కొత్త డిజైన్లలో ఆరు నుంచి తొమ్మిది మీటర్ల సైజులలో కూడా చీరలను తయారు చేయించారు. మరి ఎన్నికల ముందు ప్రభుత్వ బతుకమ్మ చీరలు మహిళలకు నచ్చుతాయో లేదో పంపిణీ సందర్భంగా తేలిపోనుంది.