• Telugu News
  • /Latest

Movie Celebrities Donations India Pakistan War: పాక్ తో యుద్దం వేళ సినీ ప్రముఖుల విరాళాలు వైరల్!

Reported by: Y.V. Narsimha Reddy | latest | May 09, 2025, 6:00 pm IST
Read Time: 4 mins
Movie Celebrities Donations India Pakistan War: పాక్ తో యుద్దం వేళ సినీ ప్రముఖుల విరాళాలు వైరల్!

Movie Celebrities Donations India Pakistan War: పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తో యుద్దం సాగుతున్న క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇండియన్ ఆర్మీకి విరాళాల ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తాజా చిత్రం సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు ఇస్తానని ప్రకటించారు. మా సపోర్ట్ ఎప్పుడు మన సైనికులకు ఉంటుందని..భారత్ మాతాకీ జై అంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇండో పాక్ తొలి యుద్ధం 1965లో జరుగుతున్నప్పుడు ఆనాటి అగ్రనటుడు ఎన్టీఆర్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 17రోజుల పాటు 1965లో ఆగస్టు 5నుంచి సెప్టెంబర్ 22వరకు యుద్దం జరిగింది. అమెరికా జోక్యంతో తాష్కెంట్ ఒప్పందంతో ఆ యుద్దం ముగిసింది. ఆ యుద్ద సమయంలో ఎన్టీఆర్ దేశ రక్షణ నిధికి విరాళాలు సేకరించారు. ఇందుకోసం ఎన్టీ రామారావు విజ్ఞప్తి..జయం మనదే ! అంటూ ప్రజలకు రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. మన భద్రత కోసం, దేశ గౌరవం కోసం దుష్ట శత్రువు నెదుర్కొని భీకర సంగ్రామంలో ప్రాణ త్యాగం చేస్తున్న సోదర భారత వీర సైనికుల సహాయార్ధం దేశ రక్షణ నిధి సేకరణకై నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రాల్లో ప్రదర్శనలీయ సంకల్పించాను..నా అభిమానులు ఆదరణ, యావదాంధ్ర ప్రజానీకం ఆశీస్సులు, మా పరిశ్రమ అండదండలు ఈ ప్రజాహిత కార్యాన్ని జయప్రదం చేయగలవని విశ్వాసం..గతానుభవమే..నన్నీ కార్యానికి పురికొల్పినవవని పేర్కొన్నారు. మాతృభూమి సంరక్షణకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని..జైహింద్ అంటూ ఎన్టీఆర్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

ఎన్టీఆర్ ఆనాడు 180మంది సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులతో జైత్రయాత్ర అనే కళా ప్రదర్శనలు నిర్వహించి దేశ రక్షణ నిధికి విరాళాలు సేకరించారు. ఎన్టీఆర్ తుఫాన్లు, వరదల సమయంలో కూడా విరాళాలు సేకరించి ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. అనంతర కాలంలో తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.