సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో సీతక్క మినహా అందరూ కోటీశ్వరులే. మంత్రుల్లో పొంగులేటి అత్యధిక ఆస్తులను కలిగి ఉండగా, అత్యల్పంగా సీతక్క కలిగి ఉన్నారు
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో సీతక్క మినహా అందరూ కోటీశ్వరులే. మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యధిక ఆస్తులను కలిగి ఉండగా, అత్యల్పంగా సీతక్క కలిగి ఉన్నారు.
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. రూ. 433.93 కోట్ల విలువైన ఆస్తులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. రూ. 46.66 కోట్లతో దామోదర రాజనర్సింహ, రూ. 39.55 కోట్లతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రూ. 30.04 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి, రూ. 17.88 కోట్లతో తుమ్మల నాగేశ్వర్ రావు, రూ. 11.83 కోట్లతో పొన్నం ప్రభాకర్, రూ. 8.13 కోట్లతో భట్టి విక్రమార్క, రూ. 6.91 కోట్లతో శ్రీధర్ బాబు, రూ. 5.99 కోట్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రూ. 5.98 కోట్లతో కొండా సురేఖ, రూ. 3.18 కోట్లతో జూపల్లి కృష్ణారావు, తర్వాత స్థానాల్లో నిలిచారు. రూ. 82.83 లక్షల ఆస్తులతో మంత్రి సీతక్క అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా నిలిచారు.
కాగా 10 మంది మంత్రులు తమకు అప్పులు ఉన్నాయని ప్రకటించగా, ఆ జాబితాలోనూ రూ. 43.53 కోట్లతో మంత్రి పొంగులేటి టాప్లో ఉన్నారు. దామోదర రాజనర్సింహకు రూ. 14.35 కోట్ల అప్పులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ. 6.44 కోట్లు, రేవంత్ రెడ్డి రూ.1.30 కోట్లు, తుమ్మల నాగేశ్వర్ రావుకు రూ. 81 లక్షలు, పొన్నం ప్రభాకర్కు రూ. 75 లక్షలు, శ్రీధర్ బాబుకు రూ. 1.79 కోట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రూ. 85 లక్షలు, జూపల్లి కృష్ణారావుకు రూ. 1.50 కోట్లు, సీతక్కకు రూ. 24 లక్షల అప్పులు కలిగి ఉన్నాయి. కొండా సురేఖ, భట్టి విక్రమార్కకు అప్పులు లేవని ఏడీఆర్ నివేదిక తెలిపింది.