Ministers Criminal Cases | భారత మంత్రుల్లో సగంమందిపై క్రిమినల్ కేసులు – 23,000 కోట్లకు పైగా ఆస్తులు: ADR నివేదిక
ADR నివేదిక: భారత మంత్రుల్లో సగంమంది క్రిమినల్ కేసులతో, మొత్తం ఆస్తులు ₹23,929 కోట్లతో ఉన్నారు. ఇందులో 36 మంది మంత్రులు బిలియనీర్లు. ధన-నేర-రాజకీయాల ముసుగులో ప్రజాస్వామ్య పారదర్శకతపై ఏడీఆర్ సందేహాలు వ్యక్తం చేస్తోంది.

Ministers Criminal Cases | భారత రాజకీయాల్లో డబ్బు, నేరం, అధికార కాంక్ష అనే మూడు అంశాలు ఎప్పటినుంచో చర్చనీయాంశాలు. ఇప్పుడు Association for Democratic Reforms (ADR), National Election Watch (NEW) సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక మళ్లీ ఆ వాస్తవాన్ని రుజువు చేసింది. దేశవ్యాప్తంగా 643 మంది మంత్రుల అఫిడవిట్లు (2020–2025 మధ్య) పరిశీలించగా, దాదాపు సగం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తేలింది. వీరిలో చాలామంది మీద హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన అభియోగాలున్నాయి. ఇదే సమయంలో, మంత్రుల వద్ద ఉన్న ఆస్తులు కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉన్నాయి – సగటున ప్రతి మంత్రికి ₹37.21 కోట్లు ఆస్తులున్నాయి. కలిపి చూస్తే మొత్తం ఆస్తులు ₹23,929 కోట్లు!. కళ్లుతిరిగిపోయే వాస్తవమిది.
క్రిమినల్ కేసుల నిజాలు
దేశవ్యాప్తంగా ఉన్న 643 మంది మంత్రుల్లో 302 మంది (47%) క్రిమినల్ కేసులు ఉన్నవారు.
వీరిలో 174 మంది (27%) తీవ్ర నేరాలు (హత్య, మహిళలపై నేరాలు మొదలైనవి) ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్చేరి వంటి 11 రాష్ట్రాల్లో 60% కంటే ఎక్కువ మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
మరోవైపు హర్యానా, జమ్మూ & కాశ్మీర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్క మంత్రిపైనా కేసులు లేవు.
కేంద్ర మంత్రివర్గంలో ఉన్న 72 మందిలో 29 మంది (40%) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
పార్టీ వారీ గణాంకాలు
TDP – 96% మంత్రులు కేసులతో, వీరిలో 57% తీవ్రమైన నేరాలతో.
DMK – 87% మంత్రులు కేసులతో.
INC (Congress) – 74% కేసులు, వీరిలో 30% తీవ్రమైన నేరాలతో.
BJP – 40% మంత్రులు కేసులతో, 26% తీవ్రమైన నేరాలతో.
AAP – 69% మంత్రులు కేసులతో.
ఆస్తుల గణాంకాలు – బిలియనీర్లే మంత్రులు
మొత్తం మంత్రుల కలిపి ఆస్తులు ₹23,929 కోట్లు.
సగటున ఒక్కో మంత్రికి ₹37.21 కోట్లు ఆస్తులు.
దేశవ్యాప్తంగా 36 మంది బిలియనీర్ మంత్రులు ఉన్నారు.
రాష్ట్రాల వారీగా: కర్ణాటక (8), ఆంధ్రప్రదేశ్ (6), మహారాష్ట్ర (4) బిలియనీర్ మంత్రులతో ముందంజలో ఉన్నారు.
పార్టీ వారీగా బిలియనీర్స్
TDP – 26% మంత్రులు బిలియనీర్లు.
Congress – 18% మంత్రులు బిలియనీర్లు.
BJP – 4% మంత్రులు బిలియనీర్లు.
చిన్న పార్టీల్లో JD(S) (50%), Janasena (33%) బిలియనీర్ మంత్రులు ఉన్నారు.
అత్యంత ధనవంతులు
డా. చంద్ర శేఖర్ పెమ్మాసాని (TDP, గుంటూరు MP) – ₹5,705 కోట్లు
DK శివకుమార్ (INC, కర్ణాటక) – ₹1,413 కోట్లు
చంద్రబాబు నాయుడు (TDP, ఆంధ్రప్రదేశ్) – ₹931 కోట్లు
తక్కువ ఆస్తులు కలిగినవారు:
సుక్ల చరణ్ నోత్యా (IPFT, త్రిపురా) – ₹2.06 లక్షలు
బీర్బాహా హన్స్దా (AITC, పశ్చిమ బెంగాల్), సంతాన చక్రవర్తి (BJP, త్రిపురా) – ₹5 లక్షల లోపు ఆస్తులు.
మమతా బెనర్జీ (CM, పశ్చిమ బెంగాల్) – ₹15.38 లక్షలు మాత్రమే.
ఇతర ముఖ్య అంశాలు
అప్పులు లేదా బకాయిలు: పెమ్మాసాని వద్ద ₹1,038 కోట్లు బకాయిలు, మంగళ ప్రభాత్ లోధా (BJP, మహారాష్ట్ర) వద్ద ₹306 కోట్లు, DK శివకుమార్ వద్ద ₹265 కోట్లు.
మహిళా మంత్రులు: మొత్తం 643 మందిలో కేవలం 63 మంది (10%) మాత్రమే మహిళలు.
విద్యార్హతలు: 71% గ్రాడ్యుయేట్లు లేదా పై స్థాయి చదువులు. 26% ..12 వ తరగతి వరకు మాత్రమే చదివారు.
వయసు: 61% మంత్రులు 41–60 ఏళ్ల మధ్య వయసు. 33% 60 ఏళ్లకు పైబడి ఉన్నవారు. కేవలం 6% మాత్రమే 40 ఏళ్లలోపు.
డబ్బు, నేరాలు, రాజకీయాలు మూడూ భారత ప్రజాస్వామ్యంలో ఇంకా విడదీయరాని అంశాలుగానే మిగిలిపోతున్నాయని ADR నివేదిక మరోసారి నిరూపించింది.