విధాత: సోవియట్ యూనియన్ కూలిపోయి, అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యం ఏర్పడిన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కుట్ర పూరితంగా సాగుతున్నది. అమెరికాలో, యూరప్ దేశాలలో జాతీయవాదం పేర ఫాసిస్టు శక్తులు పెచ్చరిల్లి పోతున్నాయి. ఇవి ప్రజలలో విద్వేష భావజాలాన్ని పెంచి, ప్రజాస్వామిక విలువలను నాశనం చేసే పనిలో పడ్డాయి. ప్రజాస్వామిక వ్యవస్థలను నిర్వీర్యపరిచి, మళ్లా పెట్టుబడిదారీ సంస్థల ఆధిపత్యాన్ని స్థాపించే ప్రయత్నం సాగుతున్నది. మన దేశంలోనూ సామ్రాజ్యవాదం కాలుమోపింది. ఈ ఉక్కు పాదం […]
విధాత: సోవియట్ యూనియన్ కూలిపోయి, అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యం ఏర్పడిన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కుట్ర పూరితంగా సాగుతున్నది. అమెరికాలో, యూరప్ దేశాలలో జాతీయవాదం పేర ఫాసిస్టు శక్తులు పెచ్చరిల్లి పోతున్నాయి. ఇవి ప్రజలలో విద్వేష భావజాలాన్ని పెంచి, ప్రజాస్వామిక విలువలను నాశనం చేసే పనిలో పడ్డాయి. ప్రజాస్వామిక వ్యవస్థలను నిర్వీర్యపరిచి, మళ్లా పెట్టుబడిదారీ సంస్థల ఆధిపత్యాన్ని స్థాపించే ప్రయత్నం సాగుతున్నది.
మన దేశంలోనూ సామ్రాజ్యవాదం కాలుమోపింది. ఈ ఉక్కు పాదం కింద ప్రజాస్వామిక విలువలు నశించి పోయే ప్రమాదం ఏర్పడ్డది. ఫాసిస్టు శక్తులు ప్రజా వ్యతిరేక భావజాలాన్ని చక్కెర పూసి ప్రచారంలో పెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే విప్పారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలోని కొద్దిపాటి లోపాలను భూతద్దంలో చూపిస్తూ, ఫాసిస్టు పాలనే పరిష్కారంగా చెబుతున్నాయి.
ఉదాహరణకు చమురు సహజవాయువు నిక్షేపాలు ఒక వ్యాపార కుటుంబానికి అప్పగించడాన్ని తప్పు పట్టకుండా, గ్యాస్ సిలిండర్కు ఇచ్చే కొద్దిపాటి సబ్సిడీ వల్లనే సమాజానికి నష్టం వాటిల్లినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రజా ప్రతినిధుల పట్ల అపనమ్మకం కలిగించే ప్రచారం సాగుతున్నది. ఓడరేవులు, రైల్వే, బీమా సంస్థలు మొదలుకొని అన్నింటినీ గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, సంక్షేమ పథకాలను ఉచితాలంటూ తూలనాడటం పరిపాటి అయింది.
ప్రజాస్వామిక విలువలకు, రాజ్యాంగ లక్ష్యాలకు ప్రమాదం వాటిల్లుతున్న నేపథ్యంలో అంబేద్కర్ భావజాలాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మరింత ఏర్పడ్డది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడమే కాదు, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చుకోవాలని కాంక్షించారు. రాజ్యాంగ లక్ష్యాలు వాటికవే నెరవేరవు. అందుకు సామాజిక ఆర్థిక సమానత్వమే ప్రాతిపదిక అని నాడే బోధించారు.
స్వాతంత్య్రోద్యమ ప్రముఖులలో ప్రజాస్వామిక విలువల పట్ల గౌరవం ఉన్నది. మన దేశంలో ఒక గణతంత్ర, ప్రజాస్వామిక, సామ్యవాద వ్యవస్థను నిర్మించుకోవాలనే విషయంలో ఆనాడు దాదాపుగా ఏకాభిప్రాయం ఉన్నది. అంబేద్కర్ ఇందుకు మినహాయింపు కాదు. కానీ ఆయన రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చడంలో పరిమితులను, వాటిని అధిగమించడానికి మార్గాలను చెప్పారు.
ఇప్పుడు 75 ఏండ్ల కాలంలో మనం ఎక్కడ పొరపాటు పడ్డామనే విషయంలో సమీక్షించుకోవాలె. ఫాసిస్టు పడగనీడలోకి దేశం వెళ్ళకుండా కాపాడుకోవడం గురించీ అప్రమత్తం కావాలె. ఈ రెండు అంశాల నేపథ్యంలో అంబేద్కర్ కృషి ఉపయోగపడుతుంది.
అంబేద్కర్ లేవనెత్తిన సామాజిక కోణం ఇంకా రాజకీయ అవసరాలకు మించి గుర్తింపునకు రావడం లేదు. ఒకప్పుడు పోలీస్ స్టేట్స్ ఉండేవి. ప్రజలను అదుపు చేయడం మించి మరే విధులు వీటికి ఉండవు. కానీ ఇప్పుడు ఆధునిక రాజ్యాలు ఏర్పడ్డాయి. లౌకిక, ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి ఉండటం వీటి లక్షణం. అయితే సామాజిక ఆర్థిక మార్పుకు దోహదపడటం అనేది ఆధునిక రాజ్య ప్రధాన లక్షణం, స్వభావం.
సామాజిక పరివర్తన సాధించడం అంటే మన రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చుకోవడం. ప్రజాస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవడం. ఈ విషయంలో అంబేద్కర్కు స్పష్టత ఉన్నది. అందుకనే మిగతా స్వాతంత్య్రోద్యమ నాయకులకు మించి సామాజిక పరివర్తన మీద దృష్టి సారించారు. ఇందుకు రాజ్యం సాధనంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
సామాజిక, ఆర్థిక సమానత్వ సాధన ద్వారా ప్రజాస్వామిక సమాజ స్థాపన జరుగుతుందని భావించారు. రాజకీయంగా అందిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అనుభవించాలంటే ఈ సామాజిక పరివర్తన తప్పనిసరి. లేనట్టయితే రాజ్యాంగ లక్ష్యాలను సాధించలేమని ఆయన స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగం నిర్దేశించే సమానత్వం సరిపోదు. ఒక మనిషికి ఒక ఓటు కల్పిస్తున్నాం, కానీ ఒకే విలువ కల్పించలేదు అనేది ఆయన హెచ్చరిక.
ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. సామ్రాజ్యవాదం పూనుకునే కొద్దీ పేదల పరిస్థితి దిగజారుతుంది. ప్రజాస్వామ్యం నామమాత్రం అవుతుంది. అట్టడుగు వర్గాలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. (ఆధునికత, సాంకేతిక తెచ్చే మార్పులను ప్రపంచీకరణతో కలగాపులగం చేయవద్దు)
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ ఏడున్నర దశాబ్దాలలో సామాజిక మార్పు కోణాన్ని పాలకులు విస్మరించారు. రాజ్యం ఒక యథాతథ స్థితిని కాపాడే సాధనంగానే మిగిలిపోయింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మన దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందినప్పటికీ, సామాజిక పరివర్తన కోణాన్ని మాత్రం విస్మరించడం సమాజానికి తీవ్ర హాని చేసింది. రేపటి రోజు సామాజిక వర్గాల వారి కేంద్రీకరణకు నేటి పరిణామాలు దోహదం చేయవచ్చు.
ఇప్పటికైనా అంబేద్కర్ ఆనాడే అప్రమత్తం చేసిన విధంగా, సామాజిక పరివర్తన దిశగా ఆలోచించాలె. ధైర్యంగా ఒక కులాంతర లేదా మతాంతర వివాహాన్ని చేసుకోలేని స్థితి ఉందంటే, సామాజిక పరివర్తన కోణంలో ఎంత జడంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.
అంబేద్కర్ మరో గొప్ప కాంట్రిబ్యూషన్ బౌద్ధాన్ని పరిచయం చెయ్యడం. ఇది ఆయన సామాజిక కోణంలో భాగమే కావచ్చు. కానీ రాజ్యాంగపరంగా, రాజకీయ వ్యవస్థ సామాజిక కోణాన్ని విస్మరించకూడదనేది ఒకటి. అయితే సామాజిక పరమైన ప్రయత్నాన్ని కూడా ఆయన ఇంకా పకడ్బందీగా సూచించారు.
ఆయన చూపిన బౌద్ధం మతపరమైనది కాదు. మానవీయ విలువలకు సంబంధించినది. సమాజం మతపరమైన భావజాలం నుంచి బయటపడి ఆధునిక సమాజం, ఆధునిక మానవులు రూపొందాలని మనం కోరుకుంటాం. కానీ కారణాలు ఏవైనా చాలా మంది ఏదో ఒక మతాన్ని అంటిపెట్టుకొని ఉండాలని కోరుకుంటున్నారు. మతమంటే కేవలం దైవభక్తి మాత్రమే కాదు, సంస్కృతి, సంప్రదాయం వగైరాలు దానితో పెనవేసుకొని ఉంటాయి.
పలు దేశాలలో కమ్యూనిస్టు వ్యవస్థలు ఏర్పడ్డాయి. కానీ మన దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాం. ప్రజాస్వామ్య సోషలిజం అంటూ ఒక మార్గాన్ని చేపట్టాం. ఇదే దశలో సామ్యవాదం, సామ్రాజ్యవాద వ్యతిరేకత, జాతీయతావాదం మొదలైనవి ప్రాతిపదికలుగా అరబ్బు దేశాలలో బాతిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారు మతాన్ని తిరస్కరించలేదు. అలాగని మత ప్రభుత్వాలు కావు. మంచి లౌకిక సంస్కృతిని అనుసరించారు. ఇట్లా ప్రజల చైతన్యాన్ని, సంసిద్ధతను బట్టి వ్యవస్థలు నెలకొంటూ ఉంటాయి.
ఇక మన వ్యవస్థలో హిందు మత సంకెళ్ళ నుంచి విముక్తి పొందడానికి సమాజం తంటాలు పడుతున్నది. ఇది కుల వ్యవస్థను కాపాడే ఒక సామాజిక వర్గ ఆధిపత్యంలో ఉన్నది. చాలా మందికి ఈ వ్యవస్థ నుంచి విముక్తి పొందాలని ఉన్నది. కానీ మతాన్ని పూర్తిగా వదులుకోలేని పరిస్థితి. ఈ స్థితిలో అంబేద్కర్ చేపట్టిన బౌద్ధం దారి చూపుతున్నది.
అంబేద్కర్ కోరుకున్నది మరో మతం కాదు. ఈ మత సంకెళ్ళ నుంచి జనాన్ని విముక్తి చేయడానికి చూపిన మార్గం. ఇది బ్రాహ్మణేతర కులాలన్నిటికీ విముక్తి మార్గం. కానీ సమాజం దీనిని ఉపయోగించుకోలేక పోయింది. దీనినొక దళితులకు సంబంధించిన అంశంగా పరిమితం చేశారు. అంబేద్కర్నే ఆ స్థాయికి కుదించడం మాదిరిగా ఇది కూడా ఒక కుట్రే.
అంబేద్కర్ ఒక గొప్ప తత్వవేత్త, పరిశోధకుడు, సంఘ సంస్కర్త. రాజ్యాంగ రచనలో ఆయన సేవలు తెలిసినవే. అంబేద్కర్ విగ్రహాలను ఇప్పటికే దేశమంతటా నెలకొల్పుకున్నాం. అతి పెద్ద విగ్రహాన్ని పెట్టుకోవడం కూడా హర్షణీయమే. కానీ అంబేద్కర్ ఆశయాలను కూడా ఆచరించాలె. ఇందుకు రాజ్యం ఒక సాధనంగా మారాలె.
– పరాంకుశం వేణుగోపాల స్వామి