Site icon vidhaatha

Gadari Kishore | చిక్కుల్లో BRS ఎమ్మెల్యేలు.. ఎన్నికల వేళ రేగుతున్న వివాదాలు

Gadari Kishore

ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో వివాదాలకు దూరంగా, ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ ఎమ్మెల్యే(MLA)లు కొందరు అనవసర వివాదాలతో, నోరు జారుతున్న మాటలతో వివాదాల్లో చిక్కుకోవ‌డం అధికార పార్టీ(Party)కి సంకటంగా మారుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలలో అవినీతికి, అక్రమ వ్యాపారాలకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో ఆవేశంతో ఎమ్మెల్యేలు నోరు జారుతూ మరింత వివాదాస్పదమవుతున్నారు.

విధాత: తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ సైతం ఈ తరహా వివాదంలో చిక్కుకోవడం జిల్లా రాజకీయాలలో చర్చినీయాంశమైంది. బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కిషోర్ మాట్లాడుతూ దళిత బంధు అమలులో తాను పార్టీలకు అతీతంగా ప్రతిపక్షాల వారికి కూడా పథకం ప్రయోజనాలు అందించానని చెబుతున్న క్రమంలో ఏమ్మర్పిఎస్ కొడుకులందరికీ కూడా పథకం ప్రయోజనాలు అందాయంటూ వ్యాఖ్యానించారు.

దళిత బంధు పథకం అమలులో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే క్రమంలో గాదరి చేసిన వ్యాఖ్యలు అంతా బాగానే ఉన్నా చివరన ఎమ్మార్పీఎస్ కొడుకులంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన చుట్టూ వివాదాన్ని రాజేశాయి. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలనే ప్రచార నాస్త్రాలుగా చేసుకొని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆయనపై రాజకీయ దాడిని ఉదృతం చేశాయి.

ఎమ్మెల్యే వ్యాఖ్యలను తిరుమలగిరిలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో న్యాయవాది పి. యుగేందర్ ఖండిస్తూ ఎమ్మెల్యే కిషోర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయనపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు యుగంధర్ కారును అడ్డగించి కారు అద్ధాలు ధ్వంసం చేసి చితకబాదారు. ఆయన కొంతకాలంగా తుంగతుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఇసుక, భూ దందాలపై ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.

యుగంధర్ పై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రతిపక్షాలు ఎమ్మెల్యే కిషోర్ వైఖరిని తప్పుపడుతూ ఆయన పై తమ విమర్శనాస్త్రాలకు మరింత పదును పెట్టారు. కాంగ్రెస్ నేతలు చెరుకు సుధాకర్, అద్దంకి దయాకర్ తో పాటు ఇతర విపక్షాల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, పలు న్యాయవాద సంఘాల ప్రతినిధులు బాధితుడు యుగేందర్ ను పరామర్శించి, ఆయనపై జరిగిన దాడిని ఖండించారు. ఈ వ్యవహారంపై సూర్యాపేట జిల్లా ఎస్పీని సైతం కలిసి దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం విశేషం.

Exit mobile version