వస్త్ర ఉత్పత్తుల పాత బకాయిల కింద ప్రభుత్వం 50 కోట్ల నిధులను విడుదల చేయడంతో, సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అక్కడి నేతన్న విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించారు
వస్త్ర ఉత్పత్తుల బకాయిలు విడుదలపై నేతన్నల హర్షం
బిజెపి హయాంలోనే దేశవ్యాప్తంగా సంక్షోభంలో వస్త్ర పరిశ్రమ
నేతన్న విగ్రహానికి పాలాభిషేకం చేసిన జేఏసీ
విధాత బ్యూరో, కరీంనగర్: వస్త్ర ఉత్పత్తుల పాత బకాయిల కింద ప్రభుత్వం 50 కోట్ల నిధులను విడుదల చేయడంతో, సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అక్కడి నేతన్న విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వస్త్ర ఉత్పత్తిదారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పంతం రవి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, ప్రభుత్వం చేసిన పాపాలను ప్రక్షాళన చేసే దిశగా నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు. అందులో భాగంగానే గత ప్రభుత్వం బకాయిల్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు విడుదల చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. నిధుల విడుదలకు కృషి చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత పవర్ లుం కార్మికులను ఆదుకోవాలనే సదుద్దేశంతో జనతా వస్త్రాల పథకాన్ని తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా చేనేత పవర్లూం కార్మికులను ఆదుకునే విధంగా ప్రభుత్వ ఆర్డర్లు సిరిసిల్లకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి కార్మికుల, ఆసాముల పోరాటాలను కించపరిచే విధంగా బిజెపి నేతలు తమ కారణంగానే నిధులు విడుదలయ్యాయని, చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.వాస్తవానికి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టివేయబడ్డదని చెప్పారు.
ఎంపీగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ దుస్థితిపై, ఇక్కడి కార్మికుల సమస్యలపై బండి సంజయ్ ఏనాడు పార్లమెంటులో మాట్లాడింది లేదన్నారు. సిరిసిల్ల నేతకార్మికులు,ఇక్కడి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఎంపీగా ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో బండి సంజయ్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏమి చేశారో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ, జేఏసీ నాయకులు మండల సత్యం, వెలదండి దేవదాసు, సిరిసిల్ల రవీందర్, మండల రాజు, వెల్దండి శంకర్, తాటిపాముల దామోదర్ ,వేముల దామోదర్ , మధు గౌడ, రాజు, గోవిందు, రవి,పురండ్ల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.