విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయానికి గురువారం రంజాన్ సెలవు దినం నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. వేలాదిగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తుల రద్ధీతో క్యూలెన్లు కిక్కిరిశాయి. కొండపైన, ఆలయ ప్రాంగణ పరిసరాలన్ని భక్తుల సందడితో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు నుంచి మూడు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సివచ్చింది.
వేసవి ఎండల తీవ్రతను తట్టుకోలేక భక్తులు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన షెడ్లలో సేద తీరారు. కొండపైన శ్రీ పర్వత వర్థిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వరకు కొనసాగనున్న వసంతోత్సవాల్లో 11న సీతారామచంద్రస్వామి, హనుమంత్ మూలమంత్ర జపాలు, పంచసూక్త పారాయణాలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించనున్నారు.