KTR: ఈడీ కేసుతో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలు : కేటీఆర్

KTR: నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case) చార్జ్ షీట్ లో ఈడీ(ED) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ఎక్స్ వేదికగా విమర్శలు సంధించారు. యంగ్ ఇండియా సంస్థ(Young India Organization)కు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని..అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్లయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు. దివ్యమైన తెలంగాణని దివాళా తీయించి.. వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ? లేక ఈడీ కూడా కేవలం చార్జ్ షీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా ? లేక రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు స్కాంగ్రెస్ గా పిలిచే కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారిందన్న సంగతిని ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులతో స్పష్టమవుతుందన్నారు. తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి పేరును ఈడీ తన చార్జ్ షీట్ లో నమోదు చేసిందన్నారు. తన పేరు ఈడీ చార్జిషీట్లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టాడన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిరోజూ కొత్త నాటకాలు చేస్తున్నాడన్నారు. తన అవినీతిని చర్చించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈడీ చార్జిషీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత అయినా కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా? చూడాలన్నారు. అమృత్ స్కాం, ఆర్ఆర్ టాక్స్ స్కాం, సివిల్ సప్లై స్కాం వంటి వాటిలో ఇంతకుముందు వదిలేసినట్లుగా వదిలేస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కుర్చీ కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు
రాష్ట్ర కాంగ్రెస్ లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైందన్నారు. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోందన్నారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినాయని వ్యాఖ్యానించారు. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయన్నారు. 30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందన్నారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండిందని.. చివరికి ధర్మం గెలుస్తుందన్నారు.