విధాత: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలపునిచ్చారు. దీనికోసం కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. అది విజయవంతమైతే బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చని చెప్పారు. సీపీఐ-ఎం11 వ సాధారణ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలు వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. కాదూ కూడదు అంటే ఏం […]
విధాత: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలపునిచ్చారు. దీనికోసం కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. అది విజయవంతమైతే బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చని చెప్పారు. సీపీఐ-ఎం11 వ సాధారణ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలు వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. కాదూ కూడదు అంటే ఏం జరుగుతుందో కూడా చెప్పనక్కరలేదన్నారు.
నితీశ్ వ్యాఖ్యలు చూస్తే విపక్షాలన్నింటినీ ఏకం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉన్నది. అందుకే ఆపార్టీ నేతలు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే కాషాయ పార్టీ కట్టడం సాధ్యమౌతుందని లేకపోతే ముచ్చటగా మూడోసారి బీజేపీకి అధికారంలోకి వస్తుందని చెప్పకనే చెప్పారు. విపక్ష పార్టీలు ఐక్యంగా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అంతిమంగా అది బీజేపీకి లాభం చేకూరుస్తున్నదని అనేక అసెంబ్లీ ఫలితాల ద్వారా వెల్లడైంది. ఇదే విషయాన్ని నితీశ్ పరోక్షంగా చెప్పారు.
యూపీలో ఎస్పీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినా అక్కడ బీఎస్సీ ఎస్పీ ఓటమే ధ్యేయంగా పనిచేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అన్నిచోట్లా పోటీ చేయడం, ఎంఐఎం కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట్ల పోటీ చేసింది. ఫలితంగా 20-30 స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో బీజేపీ నేతల చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది.
ఆప్ 12.92 శాతం ఓట్లతో 5 సీట్లు గెలిచింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ 2017 లొ 77 సీట్లు గెలిచిన ఆ పార్టీ ఈసారి ఏకంగా 60 స్థానాలు కోల్పోయింది. 2017 లో 99 సీట్ల గెలిచిన బీజేపీ ఈసారి రో 57 సీట్లు గెలుచుకుని మొత్తం 156 స్థానాల్లో పాగా వేసి చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఆ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్పార్టీపై ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఇట్లా అనేక రాష్ట్రాల్లో బీజేపీకి గెలువడానికి విపక్షాల మధ్య అనైక్యతే బీజేపీకి బలం అన్నది అంకెలతో సహా రుజవు అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ముఖాముఖి తలపడే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఓకే. కానీ బీజేపీ కట్టడి చేస్తున్న ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంతో పరిస్థితి అధికారపార్టీకి అనుకూలంగా మారుతున్నదనే అభిప్రాయం ఉన్నది.
అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్న ప్రాంతీయపార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగకుండా సొంతంగా పోటీ చేయడమూ బీజేపీకి లబ్ది చేకూరుస్తున్నది. కాబట్టి నితీశ్ కుమార్ అన్నట్లు కాంగ్రెస్ నేతలు త్వరగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నది వాస్తవమే అయినా ప్రాంతీయపార్టీలు కూడా దీనిపై సీరియస్గా ఆలోచన చేస్తేనే ఫలితం ఉంటుంది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలు దీనిపై ఒక అవగాహనకు రావాలి.
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమి సాధ్యం కాదని శరద్పవార్, స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే లాంటి అభిప్రాయాన్ని అంగీకరిస్తే దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. నితీశ్ కుమార్ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి దూరంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీల అధినేతలనైనా ఒక్కతాటి మీదికి తీసుకుని వచ్చి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలతో ఒక అవగాహనకు రాగలిగితే ఆయన అన్నట్టు బీజేపీ కట్టటి సులువే అవుతుంది.