Site icon vidhaatha

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్‌ రైలు..! కాచిగూడ – యశ్వంత్‌పూర్‌కు రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌.. నేడు ట్రయల్‌ రన్‌..!

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల్లోకి కొత్తగా మరో వందే భారత్‌ రైలు పరుగులు పెట్టనున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌ – తిరుపతి – హైదరాబాద్‌, విశాఖపట్నం – హైదరాబాద్‌ – విశాఖపట్నం వందే భారత్‌ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ క్రమంలోనే కొత్తగా పలు మార్గాల్లో నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఐటీ నగరాలైన హైదరాబాద్‌ – బెంగళూరు మధ్య రైలు నడిపేందుకు రైల్వే బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండు మూడు నెలల కిందటే రైలు ప్రారంభం కానుందని వార్తలు వచ్చినా.. ఆలస్యమైంది. వందే భారత్‌ రైలు అందుబాటులోకి రావడంతో ఏడు గంటల్లోనే బెంగళూరుకు చేరుకునే అవకాశం కలుగనున్నది. రెండు నగరాల మధ్య సోమవారం అధికారులు ట్రయల్‌ రన్‌ చేపడుతున్నారు.

ఆగస్టు 6న ప్రారంభోత్సవం

రెండు నగరాల మధ్య కొత్తగా పట్టాలెక్కనున్న రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 6న రైలును ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న రైళ్లకు మంచి డిమాండ్‌ ఉండడంతో కాచిగూడ – బెంగళూరు మధ్య రైలు నడిపేందుకు రైల్వేబోర్డు అంగీకారం తెలిపింది. నిత్యం రైలు కాచిగూడ – యశ్వంత్‌పూర్ పరుగులు తీయనున్నది. ఇవాళ ట్రయల్‌ రన్‌ జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే అధికారికంగా రూట్‌, రైలు నడిచే సమయం, టికెట్ల ధరలను సైతం ప్రకటించే అవకాశం ఉన్నది.

రూట్‌ ఇదే..

కొత్తగా అందుబాటులోకి రానున్న వందే భారత్‌ రైలు నంద్యాల జిల్లా డోన్ మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు తెలుస్తున్నది. రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. రెండు నగరాల మధ్య ఇప్పటికే పలు రైళ్లు నడుస్తుండగా.. ప్రయాణ సమయం దాదాపు 11 గంటల వరకు పడుతున్నది. కొత్తగా వందే భారత్‌ రైలు అందుబాటులోకి వస్తే దాదాపు 7 గంటల్లోనే చేరుకునేందుకు అవకాశం ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా బెంగళూరు చేరుకొనేలా రూట్ ఖరారైనట్లు తెలుస్తున్నది. ట్రాక్‌ సామర్థ్యం, రైలు వేగంపై రైల్వే అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే సికింద్రాబాద్-బెంగళూరు మధ్య సుమారు ఏడు రైళ్లు నడుస్తున్నాయి. వీటికి ఫుల్‌ డిమాండ్‌ ఉండడంతో కొత్తగా తీసుకురానున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు సైతం ఆదరణ లభిస్తుందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరో రెండు మార్గాల్లోనూ..

వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో దేశవ్యాప్తంగా 75 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మార్గంలో మరో కొత్తగా నడిపించేందుకు కసరత్తు చేస్తున్నది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ – పుణేతో పాటు, నాగ్‌పూర్‌ – సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ భావిస్తున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ – పుణే మార్గంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ పరుగులు తీస్తున్నది. ప్రస్తుతం రోజు నాలుగు రైళ్లు పరుగులు తీస్తుండగా.. ఆయా రోజుల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు సైతం నడుస్తున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 8.20 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుండగా.. దాని ప్లేస్‌లో వందే భారత్‌ రైలును ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ భావిస్తున్నది. అలాగే నాగ్‌పూర్‌ – సికింద్రాబాద్‌ నాగ్‌పూర్‌ రూట్‌లోనూ కొత్తగా రైలు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నది. ఆయా రూట్స్‌లో రైళ్ల ప్రారంభంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

Exit mobile version