విధాత : 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపుతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఇస్రో హెడ్ ఆఫీస్లో మీడియాతో సోమనాథ్ చిట్ చాట్ మాట్లాడారు. శ్రీహరికోటలోని షార్లో మూడో ప్రయోగ వేదిక నిర్మిస్తామని, 2028లో చంద్రయాన్-4ను ప్రయోగించడమే లక్ష్యమని చెప్పారు. భవిష్యత్ ప్రయోగాల కోసం టెక్నాలజీ మెరుగుపరుచుకుంటామని పేర్కోన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2040 ప్రారంభంలో చంద్రునిపై వ్యోమగాముల ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారని, అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అని, దేశం గొప్ప ప్రగతి పథంలో పయనిస్తోందని తెలిపారు. అంతరిక్ష పరిశోధనలతో పాటు, వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టులలో దేశవ్యాప్తంగా విద్యార్థులను ఇస్రో నిమగ్నం చేసి, భాగస్వామ్యం చేస్తోందన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇస్రో చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో మరింత ఉత్సాహంగా చంద్రయాన్-4కు సన్నద్ధమవుతుంది.