జపాన్ లో వరుసగా వచ్చిన భూ ప్రకపంనలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి
జపాన్ (Japan) లో వరుసగా వచ్చిన భూ ప్రకపంనలు (Earth Quake) ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. వీటి బారిన పడి ఇప్పటి వరకు 30 మంది చనిపోయినట్లు గుర్తించగా.. తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. దేశమంతా న్యూ ఇయర్ వేడుకల్లో ఉండగా జనవరి 1 సాయంత్రం తొలి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో , అంతలోనే 6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. అనంతరం 24 గంటల వ్యవధిలో ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. భూ కంపనాల ప్రభావంతో సముద్రంలో అలలు ఒక మీటరు కన్నా ఎక్కువ ఎత్తుతో తీరప్రాంతాలపైకి విరుచుకుపడ్డాయి.
దీంతో చాలా ప్రాంతాల్లో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. మునిగిపోయిన వందల బోట్లు, కూలిపోయిన భవనాలు, ఛిన్నాభిన్నమైన కరెంటు సరఫరా వ్యవస్థతో దేశం అతలాకుతలమైంది. ము్ఖ్యంగా గడ్డ కట్టించే చలిలో విద్యుత్ సరఫరా లేకపోతే.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అయితే భూకంపం అనంతరం భారీ సునామీ వచ్చే ప్రమాదముందంటూ జారీ చేసిన ముందస్తు హెచ్చరికలను వాతావరణ శాఖ రద్దు చేసింది.
దీంతో కాస్తలో కాస్త దేశ ప్రజలకు ఊరట కలిగింది. అయినప్పటికీ ఎవరూ సముద్రం దగ్గరకు వెళ్లకూడదని.. అలలు భారీగానే ఉంటాయని అధికారులు సూచించారు. భూకంపం, ప్రాణ, ఆస్తి నష్టాలపై ప్రధాని కిషిద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా పెద్ద స్థాయిలో నష్టం జరిగినట్లు సమాచారం ఉంది. ప్రాణ, ఆస్తి నష్టాలను మదింపు చేయాల్సి ఉంది. గాయాల పాలైన వారిని కాపాడటానికి మేము కాలంతో పోటీ పడుతున్నాం అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్లు పాడైన చోట్ల హెలికాప్టర్లు వాడుతున్నామని.. చెట్లను తొలగించి రవాణాను పునరుద్ధరిస్తామని కిషిద వెల్లడించారు.
భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారి కోసం ఆర్మీ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. శీతాకాలం కావున నీరు, ఆహారం, దుప్పట్లు, చమురు, గ్యాసోలీన్ తదితరాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. భూకంపం రాగానే ట్రైన్లను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో సుమారు 1400 మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. భూకంపం నేపథ్యంలో జపాన్ను అన్ని విధాలా ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సెల్ఫీ అంటూ వచ్చి ప్రతిపక్ష నాయకుడిపై కత్తితో దాడి…
దక్షిణ కొరియా (South Korea) ప్రతిపక్ష నాయకుడిపై కత్తి దాడి జరిగింది. వివిధ వార్తా కథనాల ప్రకారం.. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీ నాయకుడు లీ జే మ్యుంగ్ విమానశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని సందరిక్షంచేందుకు వెళ్లగా.. దుండగుడు కత్తితో ఆయన మెడపై పొడిచేశాడు. మంగళవారం రాత్రి 10:00 గంటల సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది.
తీర ప్రాంత నగరమైన బుసాన్లో ఈ ఘటన జరిగినట్లు ద.కొరియా మీడియా వెల్లడించింది. దాడి చేసిన వ్యక్తికి 50 నుంచి 60 ఏళ్లు ఉంటాయని.. లీ పేరుతో ఉన్న టోపీని పెట్టుకుని వచ్చాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఆటోగ్రఫ్ కోసం దగ్గరకు వచ్చినట్లు నటించి కత్తితో అకస్మాత్తుగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది. అందులో దుండగుడు ఒక్కసారిగా ముందుకు దూకడం.. వెంటనే మెడపై కత్తితో పొడవడం కనిపిస్తోంది.
తర్వాత చాలా మంది లీ చుట్టూ గుమిగూడగా.. భద్రతా సిబ్బంది దుండగుడిని బయటకు లాగేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో లీకి 1సెం.మీ లోపలికి గాయం అయినట్లు తెలుస్తోంది. కిందపడిపోయిన వెంటనే ఆయన స్పృహ తప్పిపడిపోగా… కొందరు హ్యాండ్ కర్చీఫ్తో రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అనంతరం వెంటనే ఆసుపత్రికి తరలించారు.