ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా భారత్లో 4,358 సెల్టోస్ ఎస్యూవీ కార్లను రీకాల్ చేసింది. కేవలం సెల్టోస్ సీవీటీ వెర్షన్ కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది
Kia Cars | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా భారత్లో 4,358 సెల్టోస్ ఎస్యూవీ కార్లను రీకాల్ చేసింది. కేవలం సెల్టోస్ సీవీటీ వెర్షన్ కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ‘ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్’లో లోపాన్ని గుర్తించామని.. దాంతో కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. కియా సెల్టోస్ సీవీటీ గేర్ బాక్స్లో ఎలక్ట్రానిక్ ఆయిల్ బంప్ పనితీరులో లోపం గుర్తించినట్లు పేర్కొంది.
ఈ మేరకు రీకాల్ కార్యక్రమం గురించి కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖకు సైతం సమాచారం అందించినట్లు వెల్లడించింది. ఆయిల్ పంప్ లోపంతో డెలివరీ అయిన సెల్టోస్ కార్స్ గతేడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 మధ్య ఉత్పత్తి అయ్యాయని పేర్కొంది. ఈ సమయంలో 4,358 సెల్టోస్ సీవీటీ కార్లను తయారు చేశామని.. ఆ మోడల్ను కొనుగోలు చేసిన వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది. వాహనదారులను సంప్రదించి రీకాల్ చేసి లోపం ఉన్న కాంపోనెంట్ను భర్తీ చేస్తామని వివరించింది. ఇందు కోసం ఛార్జీలు వసూలు చేయడం లేదని, దేశవ్యాప్తంగా ఉన్న సర్వీస్ సెంటర్లలో ఉచితంగానే చేయనున్నట్లు తెలిపింది.
కియా సెల్టోస్ సీవీటీ 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఈ ఎస్యూవీపై ‘ఐవిటి’ బ్యాడ్జ్ ఉంటుంది. ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 113 బీహెచ్పీ పవర్, 144 ఎన్ఎం గరిష్ఠ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. సెల్టోస్ సీవీటీ హెచ్టీ ఎక్స్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ మోడల్ ధర రూ.16.66 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. కియా సెల్టోస్ సీవీటీ వెర్షన్ కార్లను.. అందులోనూ 2023 ఫిబ్రవరి-జులై మధ్య వాటినే రీకాల్ చేస్తున్నది. పూర్తి వివరాల కోసం కియా కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1800-108-5000కు కాల్ చేయవచ్చని తెలిపింది.