Site icon vidhaatha

బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం: లోకేశ్‌కుమార్ ప్రజాపతి


విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని జాతీయ బీసీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రజాపతి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాకేంద్రంలోని మాయ గార్డెన్ లో శుక్రవారం బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు.


రాష్ట్రంలో 60 శాతం పైగా బీసీ జనాభా ఉన్నా, రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. బీసీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రిజర్వేషన్ దక్కుతుందన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని, దీనిపై బీసీ సమాజం ఆలోచించాలన్నారు.


బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. తెలంగాణలో గఢీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. బడుగులంతా ఏకమైతే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదని ఆయన స్పష్టం చేశారు.


బీసీలు ఐక్యంగా తమ ఓటు హక్కుతో సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది రహస్య బ్యాలెట్‌ అని, మీరు ప్రతిఒక్కరూ మీ ఆత్మసాక్షిగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యధిక శాతానికి పైగా ఉన్న బడుగులంతా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని బీసీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, హర్యానా మేయర్ మధన్ చౌహాన్, బీసీ సంఘాల మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయ, నాగ పరిమళ, వివిధ బీసీ కుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు బెండ వీణా, మంజుల, మాయ శంకర్, రమేష్ గౌడ్, బండ నరేందర్, గొల్ల పవన్ కుమార్, రవీందర్ చారి, శ్రీనివాస్ చారి, విప్లవ్ కుమార్, సుభాష్ గౌడ్, వినయ్ జైస్వాల్, జ్వాల సాయిబాబా, ప్రసాద్ యాదవ్, నర్సింలు, సోమ కృష్ణ, నంగి పవన్ తోపాటు వేలాది మంది బీసీలు పాల్గొన్నారు.

Exit mobile version