Maharashtra | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 25 మంది సజీవ దహనం..

Maharashtra సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై దుర్ఘటన మానవ తప్పిదమే కారణం? ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై నాగపూర్‌ నుంచి పుణె వెళుతున్న ఒక ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి.. 26 మంది సజీవ దహనమయ్యారు. బుల్ధానా జిల్లాలోని సింద్‌ఖేద్రాజాలో శనివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. రోడ్డుపై డివైడర్‌ను వేగంగా ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 33 మంది […]

Maharashtra | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 25 మంది సజీవ దహనం..

Maharashtra

  • సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై దుర్ఘటన
  • మానవ తప్పిదమే కారణం?

ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై నాగపూర్‌ నుంచి పుణె వెళుతున్న ఒక ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి.. 26 మంది సజీవ దహనమయ్యారు. బుల్ధానా జిల్లాలోని సింద్‌ఖేద్రాజాలో శనివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది.

రోడ్డుపై డివైడర్‌ను వేగంగా ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 33 మంది ఉన్నారు. ‘టైర్‌ పేలిపోయి వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు మొత్తం వ్యాపించాయి’ అని ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తి చెప్పారు. ‘నేను, నా పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి బస్సు వెనుక వైపు ఉన్న అద్దాన్ని పగులగొట్టి తప్పించుకున్నాం’ అని ఆయన తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారని తెలిపారు. నలుగురైదుగురు ప్రయాణికులు అద్దాలు బద్దలు కొట్టుకుని బయటకు రావడం కనిపించిందని స్థానికుడు ఒకరు చెప్పారు. మిగిలినవారు లోపలే ఉండిపోయారని తెలిపారు.

సాయం చేయాలని కోరితే..

సహాయం చేయాలని కోరుతూ వెళుతున్న ఇతర బస్సులను ఆపేందుకు ప్రయత్నించగా.. ఏ ఒక్క బస్సూ ఆగలేదని ప్రమాదానికి గురైన బస్సులోంచి బయటపడిన వారు తెలిపారు. ‘ఈ దారిలో పింపల్‌ఖుతా వద్ద అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. సాయం కోరుతూ మమ్మల్ని పిలిచారు. ఇక్కడ చూస్తే పరిస్థితి భయానకంగా ఉన్నది’ అని స్థానికులు చెప్పారు.

‘బస్సు లోపల ఉన్నవారు అద్దాలను పగలగొట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నించారు. కొందరు నిలువునా దహించుకు పోవడం చూశాం. మంటలు బాగా ఉండటంతో మేం ఏమీ చేయలేక పోయాం.. కన్నీరు కార్చడం తప్ప’ అని విచారంతో చెప్పారు.

రోడ్డున పోయే బస్సులు ఆగి ఉంటే కొందరినైనా కాపాడేందుకు అవకాశం ఉండేదని వాపోయారు. గాయాలతో బయట పడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే సమీప హాస్పిటళ్లకు తరలించారు. వారంతా సురక్షితంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు.

మానవ తప్పిదం వల్లే ప్రమాదం!

ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని మహారాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు టైరు డివైడర్‌ను ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్‌ చెబుతున్నప్పటికీ.. నిద్రమత్తు వల్లే డ్రైవర్‌ డివైడర్‌ను ఢీకొన్నాడని పోలీసులు భావిస్తున్నారు. టైరు పేలిపోవడం కానీ, వేగం కానీ ప్రమాదానికి కారణం కాదని అమరావతి ఆర్టీవో నివేదిక స్పష్టం చేసింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 33 మంది ఉన్నారని, అందులో డ్రైవర్‌, క్లీనర్‌ సహా 8 మంది మాత్రం ప్రాణాలతో బయపడ్డారని స్టేట్‌ హైవే పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి ముందు యవత్మల్‌ జిల్లా కరంజా వద్ద బస్సును ప్రయాణికులు భోజనాలు చేసేందుకు ఆపారు. ఆ తర్వాత దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం బస్సు ప్రమాదానికి గురైంది.

ప్రమాద సమయంలో బస్సు సగటు వేగం 60-70 కిలోమీటర్లుగా ఉన్నదని ఆర్టీవో అధికారి తెలిపారు. కనుక వేగం కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నదని భావించలేమని చెప్పారు. డ్రైవర్‌కు కునుకు రావడం వల్లే బస్సు కుడి వైపుకు తిరిగి.. మొదట క్రాష్‌ బారియర్‌ను, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొన్నదని, ప్రమాదంలో డీజిల్‌ ట్యాంకర్‌ పేలిపోవడంతో అగ్ని కీలలు చుట్టుముట్టాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు.