Maharashtra | మహారాష్ట్రలో కేసీఆర్‌ పర్యటన.. మహా వికాస్‌ అఘాడీ నేతల సెటైర్లు

Maharashtra విధాత‌: మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌పై ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్‌పవార్‌, శివసేన (యూబీటీ) సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌లు విమర్శలు చేశారు. మహారాష్ట్రలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధరలకు నోచుకోవడం లేదన్న కేసీఆర్‌ విమర్శలపై స్పందించిన శరద్‌పవార్‌ తెలంగాణకు ఉల్లిపాయలు తీసుకెళ్తున్న రైతులకే అక్కడ గిట్టుబాటు కావడం లేదని పూణెలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అలాగే బీఆర్‌ఎస్‌ మహారాష్ట్రలో మీకు సవాల్‌ విసురుతుందా అంటే ఏ […]

Maharashtra | మహారాష్ట్రలో కేసీఆర్‌ పర్యటన.. మహా వికాస్‌ అఘాడీ నేతల సెటైర్లు

Maharashtra

విధాత‌: మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌పై ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్‌పవార్‌, శివసేన (యూబీటీ) సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌లు విమర్శలు చేశారు. మహారాష్ట్రలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధరలకు నోచుకోవడం లేదన్న కేసీఆర్‌ విమర్శలపై స్పందించిన శరద్‌పవార్‌ తెలంగాణకు ఉల్లిపాయలు తీసుకెళ్తున్న రైతులకే అక్కడ గిట్టుబాటు కావడం లేదని పూణెలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అలాగే బీఆర్‌ఎస్‌ మహారాష్ట్రలో మీకు సవాల్‌ విసురుతుందా అంటే ఏ సంగతి వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ఆయన ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను బీజేపీ బీ టీంగా అభివర్ణించారు. తాజాగా సంజయ్‌ రౌత్‌ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. రౌత్‌ మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభావం ఏ మాత్రం ఉండబోదన్నారు. అంతేకాదు కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనలో ఉండగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇలాగే నాటకాలు ఆడితే.. తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓటమి భయంతోనే కేసీఆర్‌ మహారాష్ట్రకు వస్తున్నారు. 12 నుంచి 13 మంది బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఇది కేసీఆర్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు మాత్రమే అన్నారు. బీఆర్‌ఎస్‌.. బీజేపీ బీ టీం. బీజేపీనే ఆయనను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తున్నదన్నారు. మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ బలంగా ఉన్నదని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

పాట్నాలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల సమావేశం రోజే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేంద్ర మంత్రులతో భేటీ కావడంపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్‌ కూడా బీఆర్‌ఎస్‌ ను దేశమంతా విస్తరిస్తామని చెప్పి ఏపీ, ఇతర రాష్ట్రాల్లోని నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు.

కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. అదీ చేయలేదు. అక్కడ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారని, ఆయన పరక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే విమర్శలు వచ్చాయి.

కొంతకాలంగా ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకుంటూ.. మహారాష్ట్ర రాజకీయాలపై మాత్రమే దృష్టి సారించడం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌శిండే, దేవేంద్రఫడ్నవీస్‌ వర్గాలు సీఎం సీటుపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

దీంతో అక్కడ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఎన్నికలు రావొచ్చు అనుకుంటున్న సందర్భంలో అక్కడ మహా వికాస్‌ అఘాడీ కూటమిని బలహీనపరచడానికే కేసీఆర్‌ ఇక్కడ పర్యటిస్తున్నారని ఎన్సీపీ, శివసేన నేతలు విమర్శిస్తున్నారు.