Site icon vidhaatha

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

విధాత‌, శ్రీశైలం: ఇల కైలాసమైన శ్రీశైలం మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక అలంకృతులైన స్వామి, అమ్మవార్లను సుగంధ పుష్పాలతో ముస్తాబైన హంస వాహనంపై అధిష్టింపజేశారు.

అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయం నుంచి వెలుపలికి తోడ్కొని వచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి క్షేత్ర వీధుల్లో గ్రామోత్సవం జరిపారు.

గ్రామోత్సవం ముందు కోలాటం, చెక్కభజన, రాజభటుల వేషాలు, జాంజ్‌ పథక్‌, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, బుట్టబొమ్మల నృత్యాలు, బీరప్పడోలు, తప్పెట్లు, డ్రమ్స్‌, భజంత్రీలు, బంజారా నృత్యం, చెంచు నృత్యం, శంఖనాదాలు మార్మోగాయి.

ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గంగాధర మండపం మీదుగా నంది మండపం వరకు సాగింది. తిరిగి అక్కడి నుంచి బయలు వీరభద్ర స్వామి ఆలయం దాకా కొనసాగింది. హంస వాహనంపై విహరించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను భక్తులు కనులారా వీక్షించారు.

రాత్రి 7 గంటలకు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కె.రాంబాబు, కార్యనిర్వహణ అధికారి డి.భ్రమరాంబ, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థానం అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మయూర వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు.

Exit mobile version