Mallikarjuna Kharge
- దేశం మార్పు కోరుకుంటున్నది
- దాన్ని మనం ఐక్యంగా సాకారం చేయాలి
- ప్రజాస్వామ్యానికి పునాది వేసిన కాంగ్రెస్
- రాజ్యాంగానికీ బీజాలు నాటిన పార్టీ
- వాటిని కాపాడే బాధ్యత కూడా కాంగ్రెస్దే
- బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై
- నిరంతరం గళమెత్తాలి
- కాంగ్రెస్ నేతలకు ఖర్గే పిలుపు
- ముగిసిన సీడబ్ల్యూసీ విస్తృత భేటీ
హైదరాబాద్: రాబోయే 2024 ఎన్నికల్లో మోదీ ఓటమి మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్లో రెండ్రోజులుగా నిర్వహించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, శాసనసభాపక్ష నాయకులతో కలిపి విస్తృతస్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కాంగ్రెస్ పునాది వేసిందని, ఇప్పుడు వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్దేనని అన్నారు. ఇందుకోసం మన తుది శ్వాస వరకూ పోరాడాల్సి ఉన్నదని చెప్పారు. ‘2023 కాంగ్రెస్ సేవాదళ్ శతాబ్ది ఉత్సవం. మహాత్మాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భానికి 2024తో వందేళ్లు నిండుతాయి. ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారం నుంచి తొలగించడమే మహాత్మాగాంధీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది.
ఈ దేశం మార్పును కోరుకుంటున్నది. అందుకు సంకేతాలు కూడా మన ముందే ఉన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మనం సాధించిన విజయాలే అందుకు సాక్ష్యం. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు.. రేయింబవళ్లు కష్టపడాల్సిన సమయం’ అని చెప్పారు. తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీలకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. లోక్సభ ఎన్నికలు 2024 ఏప్రిల్-మే మధ్య నిర్వహించాల్సి ఉన్నది.