ఢిల్లీలో మెట్రో రైల్వేస్టేషన్ పిట్టగోడ కూలి ఒకరు దుర్మరణం చెందారు. కుమార్తె నిశ్చితార్థం నుంచి వస్తున్న ఆయన ఆకస్మిక ఘటనతో మృత్యుఒడికి చేరారు
విధాత: ఢిల్లీలో మెట్రో రైల్వేస్టేషన్ పిట్టగోడ కూలి ఒకరు దుర్మరణం చెందారు. కుమార్తె నిశ్చితార్థం నుంచి వస్తున్న ఆయన ఆకస్మిక ఘటనతో మృత్యుఒడికి చేరారు. ఇదే ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన గోకుల్పురి మెట్రో స్టేషన్ వద్ద గురువారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకున్నది.
పోలీసుల వివరాల ప్రకారం.. 53 ఏండ్ల వినోద్ పాండే ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్వాసి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తన చిన్న కుమార్తె నిశ్చితార్థం జరుపుకుని రెండు రోజుల క్రితం ఢిల్లీకి వచ్చారు. గోకుల్పురి మెట్రో స్టేషన్ పిట్టగోడ ఒక్కసారి కూలి రహదారిమీద స్కూటర్పై వెళ్తున్న వినోద్పాండేపై ఇటుక పెళ్లలు పడ్డాయి. దాంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మరో నలుగురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు.
మృతుడికి కుటుంబానికి రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్ప గాయాలకు రూ. 1 లక్ష చొప్పున ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రకటించింది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఇలాంటి ఘటనే గతంలో హైదరాబాద్లో కూడా చోటుచేసుకున్నది.