Madhya Pradesh | విధాత: ముఖ్యమంత్రి సమావేశం అనగానే మూడంచెల భద్రత ఉంటుంది. అలాంటి సమావేశాల్లో సీఎంను సాధారణ ప్రజలు కలవడం కష్టం. చాలా దూరం నుంచి మాత్రమే సీఎంకు తమ సమస్యలు విన్నవించే అవకాశం ఉంటుంది. అది కూడా సీఎం అటు వైపు దృష్టి సారిస్తే తప్ప ఆ సమస్య అక్కడి వరకు వెళ్లదు. అయితే ఓ తండ్రి తన సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తన ఏడాది పసి బాబును సీఎం వేదికపైకి విసిరేశాడు. […]
Madhya Pradesh |
విధాత: ముఖ్యమంత్రి సమావేశం అనగానే మూడంచెల భద్రత ఉంటుంది. అలాంటి సమావేశాల్లో సీఎంను సాధారణ ప్రజలు కలవడం కష్టం. చాలా దూరం నుంచి మాత్రమే సీఎంకు తమ సమస్యలు విన్నవించే అవకాశం ఉంటుంది.
అది కూడా సీఎం అటు వైపు దృష్టి సారిస్తే తప్ప ఆ సమస్య అక్కడి వరకు వెళ్లదు. అయితే ఓ తండ్రి తన సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తన ఏడాది పసి బాబును సీఎం వేదికపైకి విసిరేశాడు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లోని కుష్వాహాలో జాట్ కమ్యూనిటీతో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి షాజీపూర్ గ్రామానికి చెందిన ముఖేశ్ పటేల్ అనే వ్యక్తి తన భార్య నేహా, ఏడాది వయసున్న కుమారుడితో హాజరయ్యారు. అయితే సీఎం ప్రసంగిస్తుండగానే.. ఆ వేదికపైకి ఏడాది బాబును ముఖేశ్ విసిరేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ పసిబాబును తల్లికి అప్పగించారు.
ఈ సందర్భంగా ముఖేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డకు గుండెలో రంధ్రం ఏర్పడిందని అతనికి మూడు నెలల వయసున్నప్పుడు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇప్పటి వరకు రూ. 4 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించాను.
బాబు ఆరోగ్యం మెరుగుపడాలంటే మరో రూ. 3.50 లక్షలు కావాలని వైద్యులు చెప్పారు. అంత డబ్బు తన వద్ద లేదు. అందుకే సీఎం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లేందుకు తన బిడ్డను వేదికపైకి విసిరేయాల్సి వచ్చిందని తెలిపాడు.
ఇక చిన్నారి సమస్యను తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని సంబంధిత కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.