విధాత, మెదక్ బ్యూరో: కౌడిపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్ వేణు రెడ్డి మంగళవారం రోజు రూ.20000లు రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నీరుడి పోచయ్య తిమ్మాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 357 /2లో 20 గుంటల భూమిని పానుగంటి సత్తెమ్మ వద్ద కొనుగోలు చేశాడు. ఆందులో 10 […]
విధాత, మెదక్ బ్యూరో: కౌడిపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్ వేణు రెడ్డి మంగళవారం రోజు రూ.20000లు రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నీరుడి పోచయ్య తిమ్మాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 357 /2లో 20 గుంటల భూమిని పానుగంటి సత్తెమ్మ వద్ద కొనుగోలు చేశాడు. ఆందులో 10 గుంటల భూమిని అగ్రిమెంట్ చేసుకుని ఇతరులకు అమ్మేశాడు.
మిగిలిన 10 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ నిమిత్తం ధరణి ఆపరేటర్ వేణురెడ్డిని సంప్రదించగా రూ.20000 ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని కరాకండిగా చెప్పడంతో చేసేదేమీ లేక నీరు డిపోచయ్య జనవరి 25న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఈ క్రమంలో ఏసీబీ అధికారుల సూచనల మేరకు మంగళవారం రోజు రిజిస్ట్రేషన్ కోసం రాగా రూ.20 వేలను వేణు రెడ్డి మిత్రుడు కేతావత్ రాజుకు ఇవ్వాల్సిందిగా తెలుపడంతో నీరుడు పోచయ్య రాజుకు రూ.20వేల నగదు ఇస్తుండగా పక్కా ప్రణాళికతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, సిబ్బందితో కలిసి నాలుగున్నర గంటల ప్రాంతంలో రాజును, వేణు రెడ్డిని రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.
వారి నుంచి రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం నిమిత్తం కార్యాలయంలో ఇంకా సోదాలు జరుగుతాయని తదుపరి పూర్తి సమాచారం ఇస్తామని డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. వేణు రెడ్డి, రాజులపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు వెంకటరాజా గౌడ్ రమేష్ సిబ్బంది ఉన్నారు.