Medak | మత్తు పదార్థాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్, SP

Medak విధాత, మెదక్ బ్యూరో: మత్తు పదార్థాల పట్ల ఎవరూ బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి జిల్లా స్థాయి లో ఏర్పాటు చేసిన నార్కో సమన్వయ కమిటీ (NCORD) మొదటి సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఆబ్కారీ, పోలీస్‌, విద్య, వైద్య, మహిళా సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ […]

  • Publish Date - May 16, 2023 / 07:20 AM IST

Medak

విధాత, మెదక్ బ్యూరో: మత్తు పదార్థాల పట్ల ఎవరూ బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి జిల్లా స్థాయి లో ఏర్పాటు చేసిన నార్కో సమన్వయ కమిటీ (NCORD) మొదటి సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.

ఆబ్కారీ, పోలీస్‌, విద్య, వైద్య, మహిళా సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో మత్తుపదార్థాల విక్రయం, అక్రమంగా గంజాయి సాగుచేస్తున్న పంటలను గుర్తించి కేసులు నమోదు చేసి న్యాయ స్థానం ముందు నిలబెట్టాలని అన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయంపై ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే కమిటీ దృష్టికి తెస్తే నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.\

పారిశ్రామిక ప్రాంతాల చుట్టు ప‌క్కల, పాఠశాల, కళాశాల పరిసర ప్రాంతాలలో మత్తుపదార్థాల విక్రయం జరిగే అవకాశాలుంటాయని, ఆ ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేయాలని సూచించారు. కోవిడ్ కాలంలో ముంబాయి నుండి వలసల కారణంగా, పాఠశాల, కళాశాలల విద్యార్థులు డ్రాప్ అవుట్స్ కారణంగా ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినా.. ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కాలేద‌ని అన్నారు.

వీధి బాలలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా అటు తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు వారి నడవడిక, ప్రవర్తనను గమనిస్తుండాలన్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో పరివర్తన తేగలమన్నారు. కాగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అక్రమంగా ఎండు గంజాయి రవాణా చేస్తున్న 11 మందిపై ఆరు కేసులు నమోదు చేసి బైండోవర్ చేశామని అన్నారు.

మత్తుపదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించుటకు ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించవలసినదిగా విద్యా శాఖాధికారికి సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మరాదని మెడికల్ షాపులకు సూచించవలసినదిగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సహాయ సంచాలకులకు సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి కంటి పరీక్షలు నిర్వహించి, ఆ వ్యసనం నుండి బయటికి వచ్చేలా చికిత్స అందించాలని వైద్యాధికారికి సూచించారు.

మత్తు పదారాలకు బానిసలైన వారిని గుర్తించి పునరావాస కేంద్రంలో వసతి కల్పిస్తూ వారిలో మార్పు తెచ్చుటకు కృషిచేయాలని మహిళా శిశు సంక్షేమాధికారికి సూచించారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులు మత్తుపదార్థాలకు అలవాటుపడతారని, అటువంటి అనుమానాస్పద కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నారా అని పారిశ్రామిక యాజమాన్యాలతో సమాచారం తీసుకొని కమిటీ దృష్టికి తేవాలని సూచించారు.

సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ క్షేత్ర స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మంచి సమాజం నిర్మించడమే మన లక్ష్యమని అందుకు ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేస్తూ సమాచారాన్ని చేరవేయాలని కోరారు.

సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈఓ వెంకట‌ శైలేష్, ఆబ్కారీ పర్యవేక్షకులు రజాక్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సహాయ సంచాలకులు జూకంటి రాజు, సిడిపిఓ హేమాభార్గవి, డా. నవీన్, విద్యాశాఖ నుండి సుదర్శన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Latest News