MLA Vs Corporator

విధాత, ఎల్బీనగర్‌: ఒకతను అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే.. మరొకతను బీజేపీ కార్పోరేటర్‌. ఆ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండుతుంది. నిత్యం ఒకరిపై ఒక్కరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ మీడియాకు ఎక్కుతారు. అయితే ఇటీవల ఆ ఇద్దరు నాయకులు, వాళ్ల అనుచరులు ఒకరిపై ఒక్కరు చేసుకుంటున్న ఆరోపణలతో ప్రజలు నవ్వకుంటున్నారు.

కారణం ఏమిటంటే నీవు దొంగ అంటే నీవు దొంగ అనుకుంటూ ఒకరి కబ్జాలు ఒకరు బయట పెట్టుకుంటు న్నారు. పార్క్ను కబ్జా చేశావని ఒకరంటే నీవు చెరువును కబ్జా చేశావంటూ మరొక్కరంటున్నారు. ఆ ఇద్దరిలో ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదీర్‌ రెడ్డి, ఎల్‌బీ నగర్‌ పరిధిలోని చంపాపేట్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ మధుసూధన్‌ రెడ్డి.

గత కొంతకాలంగా ఎల్‌బీ నగర్ నియోజక వర్గంలో ఇరువురి నాయకుల మధ్య పరస్పర ఆరోపణల యుద్ధం నడుస్తుంది. ఎమ్మెల్యే సుదిరెడ్డి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ వేల కోట్లు, అక్రమంగా అర్జిస్తున్నాడని ఇటీవల మధుసూదన్‌ రెడ్డి ఆరోపించారు.

ఇదిలా ఉండగా వంగా మధుసూదన్ రెడ్డి GHMC పార్క్ స్థలం కబ్జా చేశాడని, ఒక రియల్టర్ కు చెందిన భూమిని కబ్జా చేసి అతని చావుకు కారణమయ్యాడని ఎమ్మెల్యే వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే మధుసూదన్‌ రెడ్డి అయ్యప్ప ఆలయం కడుతున్నామని కోట్ల రూపాయలు వసూలు చేసి సొంతానికి వాడుకుంటున్నాడని బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపించారు.

ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2018లో జరిగిన సాదారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కోసమని BRS లో చేరారు. ఇదే క్రమంలో 2014లో వంగ మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.

ఇలా ఒకే పార్టీ నుంచి రెండు వేరు వేరు పార్టీలలో చేరిన వ్యక్తులు ఆరోపణలు చేసుకోవడంపై ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల ఆరోపణలు ఇంకెన్ని భూ కబ్జాలను వెలుగులోకి తెస్తాయో వేచి చూడాలి మరి.