MLA Vs Corporator
విధాత, ఎల్బీనగర్: ఒకతను అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మరొకతను బీజేపీ కార్పోరేటర్. ఆ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండుతుంది. నిత్యం ఒకరిపై ఒక్కరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ మీడియాకు ఎక్కుతారు. అయితే ఇటీవల ఆ ఇద్దరు నాయకులు, వాళ్ల అనుచరులు ఒకరిపై ఒక్కరు చేసుకుంటున్న ఆరోపణలతో ప్రజలు నవ్వకుంటున్నారు.
కారణం ఏమిటంటే నీవు దొంగ అంటే నీవు దొంగ అనుకుంటూ ఒకరి కబ్జాలు ఒకరు బయట పెట్టుకుంటు న్నారు. పార్క్ను కబ్జా చేశావని ఒకరంటే నీవు చెరువును కబ్జా చేశావంటూ మరొక్కరంటున్నారు. ఆ ఇద్దరిలో ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, ఎల్బీ నగర్ పరిధిలోని చంపాపేట్ డివిజన్ కార్పోరేటర్ మధుసూధన్ రెడ్డి.
ఇదిలా ఉండగా వంగా మధుసూదన్ రెడ్డి GHMC పార్క్ స్థలం కబ్జా చేశాడని, ఒక రియల్టర్ కు చెందిన భూమిని కబ్జా చేసి అతని చావుకు కారణమయ్యాడని ఎమ్మెల్యే వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే మధుసూదన్ రెడ్డి అయ్యప్ప ఆలయం కడుతున్నామని కోట్ల రూపాయలు వసూలు చేసి సొంతానికి వాడుకుంటున్నాడని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపించారు.
ఇలా ఒకే పార్టీ నుంచి రెండు వేరు వేరు పార్టీలలో చేరిన వ్యక్తులు ఆరోపణలు చేసుకోవడంపై ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల ఆరోపణలు ఇంకెన్ని భూ కబ్జాలను వెలుగులోకి తెస్తాయో వేచి చూడాలి మరి.