తెలంగాణ కాంగ్రెస్ (Congress party) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న (MLC Teenmar Mallann) అలియాస్ (చింత‌పండు న‌వీన్ కుమార్‌)ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది.

ఇటీవల జ‌రిగిన‌ బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.

ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించక పోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేర‌కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే.. మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎవ‌రైనా, ఎంత‌టివారైనా పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామ‌న్నారు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని, మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు అని పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టమ‌ని స్ప‌ష్టం చేశారు.