Nalgonda విధాత: జై భీమ్ నినాదాల కంటే అంబేద్కర్ రాజ్యాంగ అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించే ప్రభుత్వ విధానాలే అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తాయని మాజీ ఐఏఎస్, అంబేద్కర్ వాది జేబీ.రాజు అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్.బి.ఆర్ గార్డెన్ లో పూలే, అంబేడ్కర్ జాతరను కెవిపిఎస్, సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలే, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏనాడు అనని విధంగా […]
Nalgonda
విధాత: జై భీమ్ నినాదాల కంటే అంబేద్కర్ రాజ్యాంగ అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించే ప్రభుత్వ విధానాలే అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తాయని మాజీ ఐఏఎస్, అంబేద్కర్ వాది జేబీ.రాజు అన్నారు.
శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్.బి.ఆర్ గార్డెన్ లో పూలే, అంబేడ్కర్ జాతరను కెవిపిఎస్, సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలే, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏనాడు అనని విధంగా ఏడుసార్లు జై భీం అనడం ఆశ్చర్యపరిచిందని, జైభీం తో సర్థిపుచ్చుకుంటే సరిపోదని, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉంటేనే ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. లేదంటే ఉండే హక్కు లేదన్నారు.
పూలే అంబేద్కర్ చరిత్ర తెలుసుకోలేక పోతే మనం భారతీయులమే కాదని, ఇది వ్యక్తుల చరిత్ర కాదని, ఈ దేశ ఉద్యమ చరిత్ర అన్నారు. దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జీవితాలలో అఖండ జ్యోతులు నింపిన మహనీయులు పూలే అంబేడ్కర్ లు ఆన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తొమ్మిది ఏండ్లుగా బడుగు బలహీన వర్గాలను రాజ్యాంగ ఫలాలకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.
అంబేద్కర్ ఈ దేశంలో సర్వజనులకు హక్కులను ప్రసాదించాడని, అందుకే అంబేడ్కర్ సార్వజనీనుడు అన్నారు. హక్కులు ఇవ్వని మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ దేశ సర్వజనుల జీవితాలలో పూలే అంబేడ్కర్ లు అఖండ జ్యోతులు వెలిగించారన్నారు.
రాజకీయ సమానత్వం కావాలంటే అందరికి ఒకే ఓటు హక్కు కావాలని సామాజిక న్యాయం సాధన దిశగా అవిశ్రాంతంగా అంబేద్కర్ పోరాడారన్నారు. బిజెపి నేడు మతాన్ని ఆయుధంగా చేసుకొని చిచ్చు పెడుతుందన్నారు. మతకల్లోలాలను సృష్టిస్తున్నారని అన్నారు. పేదలకు చేరువలో ఉన్న ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారన్నారు. బిజెపి రాజ్యంగాన్ని కనుమరుగు చేసే కుట్రలను ఓటుహక్కు ద్వారా బుద్ది చెప్పాలన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుకు పోతున్నారన్నారు. విద్యతోనే మార్పు సాధ్యమని భావించి గురుకుల పాఠశాలను ఏర్పాటుచేసి ఆరు లక్షల మందికి కేసీఆర్ విద్యను అందిస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనతోనే మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. నరేంద్ర మోడి ప్రభుత్వం, బిజెపి ఈ దేశంలో రాజ్యంగాన్ని ఆగం చేయడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు.
బిజెపి ఈడిలను, సిబిఐలను అడ్డంపెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తున్నారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు లాంటి పథకాల ద్వారా మార్పు తెస్తున్నామన్నారు. దళితులు సమాన స్థాయికి ఎదగాలంటే దళిత బహుజనులందరు తమ పిల్లలను ఉన్నత విద్య వరకు చదివించాలన్నారు.
కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబా మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి అంబేడ్కర్ పుట్టినరోజుని ది వరల్డ్ నాలెడ్జ్ డే గా ప్రపంచ విజ్ఞాన దినోత్సవం గా జరపాలని చెప్పి పిలుపునిచ్చిందన్నారు. ఇంత పెద్ద కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా అంబేద్కర్ కు పెరుగుతూ ఉంటే అంబేద్కర్ భావాజాలాన్నే కాదు విగ్రహాన్ని కూడా భరించలేకపోతున్నారన్నారు.
మనుస్మృతి కి సంఘ్ పరివార్ శక్తులు వారసులైతే, తాము రాజ్యంగానికి వారసులమన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. బిసి ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న బిజెపి బీసీలకు వ్యతిరేకంగా పోతుందని, బిసి కులగణన చేయడం లేదన్నారు.
రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య పునాదికి పూలే, అంబేద్కర్ ఆలోచనా విధానం గర్వించదగినదన్నారు. రాజ్యాంగ రచన వల్లనే నాలాంటి ఏంతోమంది ఐ.ఏ.ఎస్ లుగా ఉన్నతమైన స్థానంలో ఉన్నారన్నారు. దేశంలో అధికార సాధనకు ఎస్సీ.ఎస్టీ. బిసి మైనార్టీలు ఐక్యంగా సాగాలన్నారు.
కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, గంజి మురళిధర్, కొండ వెంకన్న, ఔశెట్టి శంకరయ్య, మురారి మోహన్, చెరుకు పెద్దులు, కుర్రా శంకర్ నాయక్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున, ఎం.జి.యూ అధ్యాపకురాలు అనిత, రిటైర్డ్ ఎస్.ఈ దున్నా యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు, టి.ఎన్.జి.ఓ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ఎస్సీ.ఎస్టి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి, ఎల్.వి.యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,
ఎం.ఆర్.పి.ఎస్ సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ, కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమూలం శంకర్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం, దళిత నాయకులు పెరిక కరణ్ జయరాజ్, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల వెంకన్న యాదవ్,మాలిగ యాదయ్య, అవాజ్ సంఘం జిల్లా కార్యదర్శి ఆశం, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడగు ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.