Narendra Modi 22న యూఎస్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగం ఎలాన్మస్క్తో భేటీ విధాత: ప్రపంచ వేదికపై భారత్ ఉన్నతమైన, లోతైన, విస్తారమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యాఖ్యానించారు. మూడు రోజుల అమెరికా (America) పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం అమెరికా బయలుదేరిన ఆయన.. ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'భారత్ స్వాతంత్య్రం సాధించాక పుట్టి ప్రధాని అయిన వారిలో నేను మొదటివ్యక్తిని. అందుకే నా […]
Narendra Modi
విధాత: ప్రపంచ వేదికపై భారత్ ఉన్నతమైన, లోతైన, విస్తారమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యాఖ్యానించారు. మూడు రోజుల అమెరికా (America) పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం అమెరికా బయలుదేరిన ఆయన.. ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘భారత్ స్వాతంత్య్రం సాధించాక పుట్టి ప్రధాని అయిన వారిలో నేను మొదటివ్యక్తిని. అందుకే నా ఆలోచన, ఆచరణ, ప్రపంచ రాజకీయాలను చూసే విధానం విభిన్నంగా ఉంటాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలు నా ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. నా బలాన్ని నేను ఆ ఆలోచనా విధానం నుంచే పొందుతాను. నా భారతదేశం ఎలా ఉందో ప్రపంచానికి దానిని అలానే చూపిస్తాను’ అని మోదీ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘ప్రస్తుతం ఏదో దేశాన్ని భారత్ అధిగమిస్తోందని మేము అనుకోవడం లేదు. గతంలోనే మాకు రావాల్సిన ఒక గుర్తింపు, బాధ్యత, గౌరవం ఇప్పుడు వస్తున్నాయని భావిస్తున్నాం’ అని అన్నారు. చైనాతో ప్రతిష్టంభనపై స్పందిస్తూ.. మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉంటామని ప్రధాని ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ప్రతి దేశం అంతర్జాతీయ ఒడంబడికలకు, సూత్రాలకు కట్టుబడి ఉండాలని చైనా (China) ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్కు మరింత గౌరవప్రదమైన బాధ్యత దక్కాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి (UNO) లో శాశ్వత సభ్యత్వంపై స్పందించారు.
భారత్ అమెరికా సంబంధాల్లో పెను మార్పునకు నాంది పలుకుతుందని భావిస్తున్న ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రారంభమైంది. ‘యూఎస్కు బయలుదేరా. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ప్రధానంగా బుధవారం జరిగే ఐక్యారాజ్య సమిలో జరిగే అంతర్జాతీయ యోగా డే సంబరాలు, 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం, ఆ దేశ ఉభయసభలనుద్దేశించి ప్రసంగ కార్యక్రమాలతో మోదీ బిజీబిజీగా గడపనున్నారు.
కొన్ని వందల మంది ప్రవాస భారతీయులతో ఆయన నేరుగా సంభాషించనుండగా సుమారు 20కి పైగా నగరాల్లో మోదీ పర్యటనకు మద్దతుగా ప్రవాస భారతీయులు ర్యాలీలు నిర్వహించనున్నారు. 22న అమెరికా కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా రెండు సార్లు ఈ గౌరవం పొందిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు.
23వ తేదీన యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్లతో సమావేశమవుతారు. దాంతో పాటు మాస్టర్కార్డ్, యాక్సెంచర్, కోకాకోలా, అడోబ్ సిస్టం, వీసా మొదలైన 24 దిగ్గజ కంపెనీ సీఈఓలతో సహా 24 మంది మేధావులతో మోదీ సమాలోచనలు జరపనున్నారు.
అంతే కాకుండా టెస్లా అధిపతి ఎలాన్మస్క్ (Elon Musk)తోనూ ఆయన సమావేశం కానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్లో ఉత్పత్తి చేయకపోతే టెస్లా కార్ల విక్రయాలకు అనుమతించ బోమని కేంద్రం భీష్మించిన నేపథ్యంలో ఈ చర్చల్లో ఇరు వర్గాలకు సమ్మతమైన నిర్ణయం వెలువడే అవకాశముంది.
అమెరికా నుంచి భారత్ వస్తూ ఈజిప్ట్లో ప్రధాని ఒకరోజు పర్యటించనున్నారు. సాంస్కృతికంగా వివిధ రంగాల్లో గొప్ప భాగస్వామి అయిన ఈజిప్ట్తో సంబంధాలను మెరుగుపరుచుకుంటామని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్ట్లో పర్యటించడం ఇదే తొలిసారి.