గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ సముద్ర తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, భారత నావికా దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 3,300 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు
విధాత : గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ సముద్ర తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, భారత నావికా దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 3,300 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు పాకిస్థాన్, ఇరాన్కు చెందిన ఐదుగురిని భారత నౌకాదళం, ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిని గుజరాత్లోని పోర్బందర్కు తరలించారు. నిందితులను విచారిస్తున్నారు.
భారత జల్లాలోకి ప్రవేశించిన పడవలో సుమారు 3,089 కేజీల హషీష్(చరస్), 158 కేజీల మెథాంఫిటమిన్, 25 కేజీల మార్ఫిన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ 1000కోట్ల మేరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. భారతదేశంలో ఇప్పటి వరకు మాదక ద్రవ్యాల రికవరీలో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. అరెస్టు చేసిన నిందితుల నుంచి డ్రగ్స్ ఎక్కడికి తరలిస్తున్నారు? యజమాని ఎవరనే సమాచారాన్ని భద్రతా సంస్థలు సేకరిస్తున్నాయి.
అరెస్టయిన వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. పట్టుకున్న మాదక ద్రవ్యాల వివరాలను, డ్రగ్ రాకెట్ సమాచారాన్ని ఎన్సీబీ మీడియాకు వెల్లడించనుంది. ఇంతపెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను పట్టుకున్న ఎన్సీబీ, నేవి బలగాలను హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందిస్తూ ట్విట్ చేశారు. మాదక ద్రవ్యరహిత భారత్ ప్రధానమంత్రి మోడీ ముఖ్యలక్ష్యమని తెలిపారు.