ఆపరేషన్ చేయూత’తో సత్ఫలితాలు.. మావోయిస్ట్ కుటుంబాలకు కౌన్సిలింగ్

  • Publish Date - April 12, 2024 / 08:23 PM IST

నలుగురు దళ సభ్యుల లొంగుబాటు

విధాత, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ చేయూత” కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో మావోయిస్టు పార్టీ కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. తమ ఉనికి ,స్వార్ధ ప్రయోజనాల కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర, చిన్న చిన్న సమస్యలు,కారణాల వలన కుటుంబాలను వదిలేసి తెలిసీ తెలియక మావోయిస్టు పార్టీలోకి వెళ్లి చాలామంది అమాయకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు చెప్పారు. మావోయిస్టుల్లో పనిచేస్తున్న దళ సభ్యులంతా లొంగిపోయి ప్రభుత్వ ఫలాలను పొందాలని కోరారు.

లొంగిపోయిన నలుగురు సభ్యులు

ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి స్పందించి నలుగురు దళ సభ్యుల లొంగిపోయినట్లు చెప్పారు. చర్ల మండలం బూరుగుపాడుకి చెందిన వంజం దేవా, కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపెల్లి రాజ్ కుమార్@రంజిత్, చతిస్గడ్ సుకుమా జిల్లా జేగురుగొండ మండలం తిమ్మాపూర్ కు చెందిన సోడి గంగా@అశోక్, సుకుమా జిల్లా డోకుపాడు గ్రామానికి చెందిన కల్మ దేవే లు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక, అగ్ర నాయకుల వేధింపులు తట్టుకోలేక శుక్రవారం పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు.

లొంగిపోయిన వారికి చెక్కుల పంపిణీ

ఇటీవల లొంగిపోయిన దళసభ్యులు మడివి కృష్ణ, ఎర్రం పాడు గ్రామం, చర్ల మండలం (4లక్షలు), పూనెం ఆడమయ్య,అడవి రామవరం గ్రామం గుండాల మండలం (లక్ష రూపాయలు), వెట్టి బీమా,పెంటపాడు గ్రామం,చింతగుప్ప,సుకుమా లక్ష రూపాయలను జిల్లా ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు. మావోయిస్టు పార్టీ కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. తదుపరి చర్ల పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ ను ప్రారభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,CRPF 51బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సునీల్ కుమార్,141బెటాలియన్ CRPF అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్,చర్ల సిఐ రాజు వర్మ, దుమ్ముగూడెం సీఐ అశోక్ మరియు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్,రమేష్, అశోక్ రెడ్డి,ముత్యం రమేష్ మరియు ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.

Latest News