ఆశావహుల్లో సంకటం పార్టీనే నమ్ముకున్నామంటూ వేడుకోలు ఉమ్మడి ఆదిలాబాద్ లో కొలిక్కిరాని సీట్ల పంచాయితీ Congress | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: కాంగ్రెస్ టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో మరింత పోటీ ఉంటోంది. పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అధికార బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసిన తర్వాతనే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ ఆశావహుల సంఖ్య పెరిగిందనే […]
Congress | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: కాంగ్రెస్ టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో మరింత పోటీ ఉంటోంది. పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అధికార బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసిన తర్వాతనే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ ఆశావహుల సంఖ్య పెరిగిందనే చెప్పవచ్చు. అధికార పార్టీ టికెట్ కేటాయింపు ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
టికెట్ దక్కని అభ్యర్థులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం అధికార పార్టీ తరపున ఎమ్మెల్యే రేఖా నాయక్ కు టికెట్ నిరాకరించింది. ఆ స్థానంలో కేటీఆర్ స్నేహితుడు భూక్యా జాన్సన్ నాయక్ కు టికెట్ కేటాయించారు. రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ ఉద్యోగి బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజే , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో తాను కూడా టికెట్ ఆశించి, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందారు.
అయితే అధికార పార్టీ భార్యాభర్తల్లో ఏ ఒక్కరికీ అవకాశం కల్పించకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోసం ఆ పార్టీకి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా తన భర్త బాటలోనే కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ రేఖానాయక్ మాత్రం పోటీలో ఉంటానంటోంది. ప్రజా సేవ కోసం ప్రజలతో ఉండి మరోసారి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
అయితే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఇప్పుడే చెప్పలేనని, తన క్యాడర్ పూర్తిగా తన వెంటే ఉందని, వారితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏదిఏమైనా ఈసారి పోటీలో నిలిచి తన సత్తా ఏమిటో నిరూపిస్తానని శపథం చేశారు. ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తారా? భర్త శ్యాం నాయక్ బాటలో కాంగ్రెస్ గూటికి చేరుతారా? అనేది నియోజకవర్గ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు భర్త బాటలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రచారం కొనసాగుతుంది.
ఆసిఫాబాద్ లో..
కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే నియోజకవర్గానికి ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు తోడు కావడంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆసిఫాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాగే కాంగ్రెస్ లో ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకరు పార్టీ టికెట్ కోసం రావడంతో పాత అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ సాగర్ రావు వర్గానికి చెందిన డాక్టర్ గణేష్ జాదవ్ తోపాటు ఆసిఫాబాద్ డీసీపీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ వర్గానికి చెందిన మార్చుకోల సరస్వతి టికెట్ రేసులో ఉన్నారు. వీరితోపాటు శ్యాం నాయక్ ముగ్గురు అభ్యర్థులు అసిఫాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ గణేష్ జాదవ్ అలాగే శ్యాం నాయక్ రాజకీయాలకు కొత్తగా అయినప్పటికీ, సరస్వతి మాత్రం గతంలో ప్రస్తుత జడ్పీ చైర్మన్ ఆసిఫాబాద్ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మిపై ఆసిఫాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచింది. రాజకీయ అనుభవం ఉన్నది.
ఖానాపూర్ లో..
ఇకపోతే ఖానాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ తరపున యువకుడు వేడుమ బొజ్జు , ఉట్నూరు జడ్ పీటీసీ చారులత, భారత్ చౌహన్, అలాగే వినోద్ కుమార్ ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పార్టీలో తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త బాటలోనే కాంగ్రెస్ గూటికి వస్తే టికెట్ ఎవరికి వస్తుందని ఉత్కంఠ కొనసాగుతుంది.
బోథ్ లో..
మరో ఎస్టీ నియోజకవర్గమైన బోథ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావుకు టికెట్ కేటాయించలేదు. రాథోడ్ బాబురావు సిటింగ్ స్థానంలో నెరేడు కొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు టికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాథోడ్ బాబురావు సైతం అనుచరులు, అభిమానులతో సమాలోచనలు చేసి కార్యాచరణ ప్రకటిస్తానని నర్మగర్భంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు సమాచారం. ఏదైనాప్పటికీ ఈ మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగిందనే చెప్పవచ్చు.
ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజవర్గాలలో మొదటి నుంచి పార్టీని పట్టుకొని కాంగ్రెస్ టికెట్ కోసం వేచి చూస్తున్న వారిలో కొంత ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి టికెట్ దక్కుతుందా? లేదా ఎన్నికల సమయంలో కేవలం అధికార పార్టీలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ వైపు వచ్చిన వారికి టికెట్ దక్కుతుందో అని ఉత్కంఠ రేపుతోంది. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.