విధాత: సీబీఐ వజ్రోత్సవ సభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలన్న రాజకీయ సంకల్పానికి ప్రస్తుతం ఎలాంటి లోటు లేదన్నారు. కాబట్టి అవినీతిపరులు ఎంతటి శక్తిమంతులైనా వారిపై నిస్సంకోచంగా కొరడా ఝళిపించాలని సీబీఐ అధికారులకు పిలుపునిచ్చారు. ఒక్క అవినీతిపరుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పారు. మీరు చర్యలు తీసుకునే వారు చాలా […]
విధాత: సీబీఐ వజ్రోత్సవ సభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలన్న రాజకీయ సంకల్పానికి ప్రస్తుతం ఎలాంటి లోటు లేదన్నారు. కాబట్టి అవినీతిపరులు ఎంతటి శక్తిమంతులైనా వారిపై నిస్సంకోచంగా కొరడా ఝళిపించాలని సీబీఐ అధికారులకు పిలుపునిచ్చారు.
ఒక్క అవినీతిపరుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పారు. మీరు చర్యలు తీసుకునే వారు చాలా శక్తిమంతమైన వారని, వారు ఏళ్ల తరబడి ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ఉన్నారు. మీరు చర్యలకు ఉపక్రమించిన వెంటనే మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తారు. అయినప్పటికీ మీ పని పైనే దృష్టి సారించాలి. ఈ విషయంలో దేశం, చట్టం, రాజ్యాంగం మీకు అండగా ఉంటాయని భరోసా ఇస్తున్నానన్నారు. అవినీతి కట్టడికి ప్రధాని చెప్పిన మాటలు ఆహ్వానించదగినవే.
అయితే మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ, ఐటీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలను విపక్ష నేతలను రాజకీయంగా వేధించడానికి, కక్ష తీర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్డీఏ హయాంలో సీబీఐ, ఈడీ, ఐటీ జరిపిని దాడుల్లో 90 శాతానికి పైగా విపక్ష నేతలపైనే చేసినట్టు వారు విమర్శిస్తున్నారు.
గంగలో మునిగి పునీతులు అయినట్టు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. సీబీఐ, ఈడీ కేసుల్లో నోటీసులు, విచారణ ఎదుర్కొన్న అనేకమంది బీజేపీలో చేరగానే వారిపై దర్యాప్తులు ఆగిపోయిన విషయాన్ని వారు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. బీజేపీలో ఉన్నవాళ్లంతా సచ్చీలురు, మిగతా పార్టీల్లో ఉన్నవాళ్లంతా అవినీతి పరులు అన్నట్టు తమ వాట్సప్ వర్సిటీలో ప్రచారం చేయిస్తున్న సంగతి తెలిసిందే.
అవినీతి నుంచే బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం విస్తరిస్తాయి. వాటి వల్ల సమాజంజ దేశ బలం క్షిణిస్తుందన్నారు. ప్రధాని చెప్పింది వాస్తవమే అనుకుందాం. మరి బీజేపీలో ఉన్న నేతలకు ఇవేవీ వర్తించవా? వారికి మినహాయింపులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు అన్నిపార్టీల్లో ఉన్నారు.
అవినీతిని అరికట్టడానికి దేశం, చట్టం, రాజ్యాంగం మీకు అండగా ఉంటాయని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అనుకుంటే అందరిపై ఎన్డీఏ ప్రభుత్వం ఒకేలా వ్యవహరిస్తే ఇప్పుడు ప్రధాని చెప్పే మాటలకు విశ్వసనీయత ఉండేది.
కానీ వాళ్ల పార్టీలో చేరకముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, తర్వాత వాళ్లే ఇతరులపై అవినీతి ఆరోపణల గురించి ప్రసంగాలు దంచుతుండటడమే ఇప్పటి విషాదమని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నకర్ణాటక ప్రభుత్వంలో కమీషన్ల వ్యవహారంపై అక్కడి కాంట్రాక్టులే బహిరంగంగా వెల్లడించారు. మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే కొడుకు లంచం తీసుకుంటూ నేరుగా పట్టుబడినాడు.
ఈ విషయంలో ఎమ్మెల్యేపై నమోదైన కేసుపై విచారణ సందర్భంగా ఎన్ని నాటకీయ పరిణామాలు జరిగాయో దేశ ప్రజలందరీ అనుభవంలో ఉన్నదే. గురువింద గింజ తన నలుపు తాను ఎరుగదు అన్నట్టు.. ప్రధాని సొంతపార్టీ, ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ల ముందు కొరడా ఝళిపించి ఉంటే ఇవాళ ఆయనకు ఎవరూ ప్రశ్నించేవారు కాదు. ఆయన మాటలకు కూడా విలువ ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.