Site icon vidhaatha

Revanth Reddy | రాజీవ్ వల్లే దేశంలో సాంకేతిక విప్లవం రేవంత్‌రెడ్డి

Revanth Reddy | విధాత : దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 79వ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో కలిసి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను రాజీవ్ నిజం చేశారన్నారు. “రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు, అధికారాలు కల్పించారు రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థలను బలోపేతం చేశారన్నారు. దేశంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారని, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి పేదల చేతిలో అధికారం పెట్టారన్నారు.
“ఐటీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలోనే సమూల మార్పులు తెచ్చి మారుమూల పల్లెలకు చేర్చారని గుర్తు చేశారు. దేశంలో యువకులకు రాజీవ్ ఒక స్పూర్తినిచ్చారన్నారు.దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం అని, ఆయన జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను, ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి స్పూర్తితో మళ్లీ దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనన్నారు.
దేశంలో బీజేపీ విభజించు పాలించు విధానాన్ని అవలంభిస్తోందని రేవంత్‌ విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. మణిపూర్ మండుతున్నా.. ప్రధాని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ, బీఆరెస్ నాణానికి బొమ్మా, బొరుసులాంటివని, వారిద్దరిది ఫెవికాల్ బంధమని మరోసారి స్పష్టం చేశారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే… కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Exit mobile version