Galaxy F15 5G: ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ అయిన సాంసంగ్.. F సిరీస్లో సరికొత్త 5జీ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేసింది. బిగ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో గెలాక్సీ ఎఫ్15 5జీ (Galaxy F15 5G) పేరిట కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ఇంతకూ ఈ ఫోన్ ఫీచర్స్ ఏముంటాయి..? అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి..? లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సాంసంగ్ ఎఫ్ 15 ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్+128జీబీ రోమ్ వేరియంట్ ధర రూ.12,999 గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ ర్యామ్+128జీబీ రోమ్ వేరియంట్ ధర రూ.14,499గా పేర్కొంది. ఆష్ బ్లాక్, గ్రూవీ వయొలెట్, జాజీ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్, సాంసంగ్ మొబైల్ స్టోర్లలో నిన్నటి సాయంత్రం 7 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
ఇక ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్యూఐ 5తో పనిచేస్తుంది. ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, నాలుగేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని సాంసంగ్ హామీ ఇస్తోంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో పనిచేస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్ సిటీ 6100+ప్రాసెసర్తో ఈ ఫోన్ కలిగి ఉంది.
అంతేగాక 50 MP ప్రధాన బ్యాక్ కెమెరాతోపాటు 5+2 MP కెమెరాలు కూడా ఉన్నాయి. ముందువైపు 13 MP సెల్ఫీ కెమెరా ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. బ్లూటూత్ 5.3, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, యూఎస్బీఐ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 6,000 MAh బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. రెండ్రోజులపాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. సింగిల్ ఛార్జ్తో 25 గంటలు వీడియోలు ప్లే చేయొచ్చు. ఛార్జింగ్ అడాప్టర్ను విడిగా కొనాల్సి ఉంటుంది.