Hyderabad | పిల్లనిచ్చిన అత్తమామల పట్ల అల్లుడు కిరాతకంగా ప్రవర్తించాడు. అత్త గొంతు కోసి, అనంతరం మామ తల పగులగొట్టి అల్లుడు పరార్ అయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ బోడుప్పల్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో సూర్య, రుక్మిణి అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. అయితే ఈ దంపతులకు కూతురు ఉండగా.. ఆమెకు వివాహం చేశారు.
అయితే అత్తమామలతో అల్లుడు అనిల్ కుమార్కు విబేధాలు ఉన్నాయి. బుధవారం అత్తమామలతో గొడవపడ్డ అనిల్.. ఆగ్రహావేశాలకు లోనై అత్తామామపై కత్తితో దాడి చేశాడు. అత్త గొంతు కోసి, మామ తల పగులగొట్టి పరారీ అయ్యాడు అల్లుడు అనిల్.
సూర్య, రుక్మిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వృద్ధ దంపతులను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.