Supreme Court విధాత: అత్యాచారానికి గురయ్యానని ఫిర్యాదు చేసిన యువతికి కుజ దోషం ఉందో లేదో నివేదిక సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు శనివారం స్టే విధించింది. జ్యోతిష్యం విజ్ఞానశాస్త్రమా కాదా అన్న చర్చలోకి తాము వెళ్లబోమని.. అయితే ఈ పిటిషన్ను విచారించడానికి జ్యోతిష్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన వెకేషన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన యువతి […]
Supreme Court
విధాత: అత్యాచారానికి గురయ్యానని ఫిర్యాదు చేసిన యువతికి కుజ దోషం ఉందో లేదో నివేదిక సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు శనివారం స్టే విధించింది. జ్యోతిష్యం విజ్ఞానశాస్త్రమా కాదా అన్న చర్చలోకి తాము వెళ్లబోమని.. అయితే ఈ పిటిషన్ను విచారించడానికి జ్యోతిష్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన వెకేషన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేసు వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన యువతి యువకుడు ప్రేమించుకుని శారీరికంగానూ దగ్గరయ్యారు. అయితే పెళ్లి కుదిరే సమయంలో.. యువతి జాతకంలో కుజ దోషం ఉందని ఇది వివాహ బంధంలో కష్టాలు తెచ్చిపెడుతుందని యువకుడు వెనకడుగు వేశాడు. దీంతో అత్యాచారం కేసు పెట్టిన యువతి అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది.
తనకు కుజదోషం లేదని, ప్రియుడు తనను మోసం చేశాడని యువతి కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ జంటకు చెందిన జాతక చక్రాలను లక్నో యూనివర్సిటీలోని జ్యోతిష శాస్త్ర డిపార్ట్మెంటుకు అందజేయాలని ఆదేశించింది. వారి ఇద్దరి జాతకాలను అధ్యయనం చేసి నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని యూనివర్సిటీకి మే 23న ఉత్తర్వులు సైతం జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను సుమోటోగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేసు ఇప్పుడున్న దశలో ఈ ఉత్తర్వులు అవసరం లేదని, పైగా దీని వల్ల బాధితురాలి గోప్యతకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించింది. కేసు మెరిట్ల మీదే ఆధారాపడి హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించాలని ఆదేశిస్తూ విచారణను జులై 10కి వాయిదా వేసింది. హైకోర్టులో జూన్ 10న ఈ కేసు తిరిగి విచారణకు రానుంది.