Telangana Movement spirit విధాత: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి.. వందలాది మంది బలిదానాల తర్వాత పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పాసైంది. అప్పటికి ఇంకా ఎన్నికలు పూర్తికాలేదు అనుకుంటా. ఓ టీవీ చానల్లో సీనియర్ జర్నలిస్టు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరిన కీలక నేతను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ను కాదని టీఆర్ఎస్కే ఎందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ఒక ప్రశ్న సంధించారు. దీనికి ఆ […]
Telangana Movement spirit
విధాత: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి.. వందలాది మంది బలిదానాల తర్వాత పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పాసైంది. అప్పటికి ఇంకా ఎన్నికలు పూర్తికాలేదు అనుకుంటా. ఓ టీవీ చానల్లో సీనియర్ జర్నలిస్టు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరిన కీలక నేతను ఇంటర్వ్యూ చేశారు.
ఆ సమయంలో కాంగ్రెస్ను కాదని టీఆర్ఎస్కే ఎందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ఒక ప్రశ్న సంధించారు. దీనికి ఆ నేత కూడా వివరంగానే సమాధానం ఇచ్చారు. సుదీర్ఘకాలం ఉద్యమంలో నాయకత్వస్థానంలో పనిచేశామని, ఇక్కడి ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
విభజన చట్టం ప్రకారం ఏపీకి చెందిన ఉద్యోగులు వాళ్ల స్వరాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇస్తే.. అది పూర్తిస్థాయిలో అమలు కాదని, కేంద్రంలో ఉండే ఆ పార్టీ పెద్దల ఆదేశాల మేరకే ఇక్కడి నాయకత్వం నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.
అదే కేసీఆర్ ఆ పని చేస్తే మీతో సహా అందరూ నిలదీస్తారని అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కు ఉన్న తేడా అని అందుకే ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి టీఆర్ఎస్కే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు.
నిజానికి ఉద్యమ సమయంలో కొన్ని మీడియా చానళ్లు భావోద్వేగాలు రెచ్చగొట్టినా.. కొన్ని ఛానళ్లలోని సీనియర్ జర్నలిస్టులు అంశాల వారీగానే చర్చలు చేశారు. మరి ఈ తొమ్మిదేళ్ల కాలంలో విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా 9, 10 షెడ్యూల్ల విభజన అంశం ఇంకా అపరిష్కృతంగానే ఉన్నది. దీనికి మీరంటే మీరు కారణమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.
గడిచిన ఏడాదిపైగా కాలంగానే బీఆర్ఎస్ బీజేపీతో వచ్చిన విభేదాల కారణంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది. పార్లమెంటులో నిరసన తెలుపుతున్నది. కానీ అంతకుముందు బీజేపీ భాగస్వామ్య పార్టీల కంటే ఒక్క అడుగు ముందుకేసి అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు తెలిపింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ వ్యూహాల్లో భాగంగా కేంద్రంతో సంఘర్షణ కంటే సఖ్యతతో మెలగాల్సి వచ్చిందని అధికారపార్టీ నేతలు సమర్థించుకోవచ్చు.
కానీ ఈ రెండు షెడ్యూల్స్ లోని విద్యాసంస్థల్లో ఇప్పటికీ సీమాంధ్ర వారిదే ఆధిపత్యం కొనసాగుతున్నదనే విమర్శలు ఉన్నాయి. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అయినా ఇంకా వారి పెత్తనమే కొనసాగుతున్నదని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం 61 ఏళ్ల వయో పరిమితి పెంచడం వల్ల వారే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వాల్లే ఎక్కువ మంది ఉండటం కూడా ఉన్నత విద్యా సంస్థల్లో విభజనలో అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి.
దీనికితోడు కేసీఆర్, జగన్ల మధ్య ఉన్న రాజకీయ అవగాహనతో ఈ సమస్యపై బీఆర్ఎస్ ఎక్కువగా దృష్టి సారించడం లేదనే వాదనలు ఉన్నాయి. స్థానికత అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రధాన్య అంశం కాదు. ఎందుకంటే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఏపీ ఓటర్ల ప్రభావం ఉన్నదని, ఆ సీట్లు దక్కించుకోవడానికి వారిని ప్రసన్నం చేసుకోవడానికే అధికారపార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నదనే విమర్శలు ఉన్నాయి.
ఉద్యమ సమయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఒక మాట అనే వారు. బలదానాలతో చలించిపోయిన ఆయన మీరు బతికి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో నాలుగైదు తరాలు తీవ్రంగా నష్టపోయాయని, మీకు స్వరాష్ట్ర ఫలాలు దక్కాలని అందుకే మీరు బతికి ఉండి పోరాడాలని యువతను కోరేవారు.
మరి రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసిన ఘనత బీఆర్ఎస్దే అంటున్న నేతలు మీరు ఇప్పటికీ సీమాంధ్ర ఆధిపత్యంలో ఉన్న విద్యాసంస్థల గురించి ఎందుకు గొంతెత్తి మాట్లాడటం లేదనే ప్రశ్నలు తలెత్తున్నాయి. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ సమయంలో విభజన సమస్యలపై బీఆర్ఎస్ ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం శోచనీయం.
ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నది. ఈలోగా ఉన్నత విద్యా సంస్థల్లో తెలంగాణ వారికి అవకాశాలు దక్కాలి. విభజన చట్టం ప్రకారం 58:42 ప్రకారం నిధులు, ఉద్యోగుల పంపిణీ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా నిలబడాలి అని ఇక్కడి నిరుద్యోగ యువత కోరుకుంటున్నది. ఈ రెండు షెడ్యూల్స్లలో సీనియారిటీ ప్రకారంగా కాకుండా స్థానిక ఆధారంగా బదిలీలు జరగాలి. అప్పుడు ఇక్కడ ఖాళీలు ఏర్పడుతాయి. వాటిని తెలంగాణ వారితో భర్త చేసుకోవచ్చు.
ఇలా జరగకపోతే ఉన్నతచదువులు చదివి అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్న తమకు తీరని అన్యాయం జరుగుతుందని వారు అంటున్నారు. ఇక్కడి యువతకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం నాటి ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించాలంటున్నారు. అప్పుడే నియామకాల్లో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఉద్యమకారులు చెబుతున్నారు.